సిద్దిపేట/చిన్నకోడూరు, జూలై 1: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బాయిలకాడ కరెంటు మీటర్లు పెట్టాలని రాష్ర్టాలపై ఒత్తిడి తెస్తూ రైతుల మెడకు ఉరితాడు వేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. బీజేపీ సర్కారు ఎంత ఒత్తిడి తెచ్చినా తెలంగాణలో కరెంటు మీటర్లు పెట్టేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఒప్పుకోలేదని తెలిపారు. హరీశ్రావు శుక్రవారం సిద్దిపేట జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. చిన్నకోడూరులో ఆర్అండ్బీ రింగు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల క్షేమం కోసమే సీఎం కేసీఆర్ ఎఫ్ఆర్బీఎం కింద వచ్చే రూ.25 వేల కోట్లను తిరస్కరించారని తెలిపారు.
ఈ విషయాన్ని ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు ప్రజలకు వివరించాలని సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రైతుల నుంచి ముక్కుపిండి నీటి తీరువా వసూలు చేస్తున్నారని విమర్శించారు. మడి ఎండకుండా పంట పండిన దాఖలాలు గత ప్రభుత్వాల పాలనలో లేవని, ఇప్పుడు గుంట కూడా ఎండకుండా 24 గంటల కరెంట్ ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఫోన్లకు రైతుబంధు మేసేజ్లు టింగ్టింగ్మని వస్తుండటంతో రైతుల ముఖాల్లో ఆనందం కనిపిస్తున్నదని అన్నారు. దేశంలో అన్ని ప్రభుత్వాలు రైతుల వద్ద శిస్తు వసూలు చేస్తే.. రైతులకే పన్ను కట్టిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు.
పట్టణాలకు సకల హంగులు
పట్టణాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదని మంత్రి హరీశ్రావు తెలిపారు. సిద్దిపేటలో రూ.160 కోట్లతో 88 కిలోమీటర్ల రింగు రోడ్డు నిర్మిస్తున్నామని, సిద్దిపేట ప్రతిష్ఠను రింగురోడ్డు మరింత పెంచుతుందని చెప్పారు. రెండు వరుసల రింగు రోడ్డు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు సిద్దిపేట ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. పైసా ఖర్చు లేకుండా పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇస్తున్నామని, సొంత జాగాలో ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల చొప్పున సాయం చేస్తామని చెప్పారు.
సిద్దిపేట జిల్లా కేంద్రం సరస్వతి నిలయంగా, విద్యాక్షేత్రంగా అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. పదో తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం గొప్ప విషయమని పేర్కొన్నారు. సిద్దిపేటలోని క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మంత్రి శుక్రవారం అభినందించారు. పిల్లలు ఫస్ట్క్లాస్లో పాసైతే వారి తల్లిదండ్రులు ఎంత సంతోషం పొందుతారో, రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో నిలిచినందుకు తాను సైతం అంతే అనందపడ్డానని తెలిపారు. మంత్రి వెంట జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ తదితరులు ఉన్నారు.