హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం మిల్లర్లకు కేటాయించిన ధాన్యంలో ఒక గింజను కూడా వదలబోమని, ఒక రూపాయినీ పోనివ్వబోమని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టంచేశారు. గురువారం ఆయన సీఎమ్మార్ అంశంపై ఉన్నతాధికారులతో హైదరాబాద్లోని తన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. అక్రమాలకు పాల్పడుతున్న, డిఫాల్ట్ మిల్లర్లు అధికంగా ఉన్న సూర్యాపేట, నల్లగొండ, వనపర్తి, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో పటిష్టమైన టాస్ఫోర్స్ను తక్షణమే ఏర్పాటుచేస్తున్నట్టు ప్రకటించారు. మిగతా అన్ని జిల్లాల్లోనూ విశ్రాంత పోలీస్, రెవెన్యూ ఉన్నతాధికారులతో కట్టుదిట్టమైన టాస్ఫోర్స్ ఏర్పాటుచేస్తామని వివరించారు. ధాన్యం అమ్ముకునే మిల్లర్లను, పక్కదారి పడుతున్న రేషన్ బియ్యాన్ని గుర్తించి సమాచారం అందించిన పౌరులకు రివార్డులు అందజేస్తామని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.
125% క్యాష్ రికవరీ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో ధాన్యం సేకరణ 24 లక్షల టన్నుల నుంచి 141 లక్షల టన్నులకు, అంటే ఆరు రెట్లు పెరిగిందని గంగుల కమలాకర్ వివరించారు. మిల్లింగ్ సామర్థ్యం రెండు రెట్లు మాత్రమే పెరిగిందని, దీంతో మిల్లర్లకు అదనంగా ధాన్యం కేటాయింపులు చేయాల్సి వస్తున్నదని తెలిపారు. ఇదే అదనుగా కొన్నిచోట్ల మిల్లర్లు ధాన్యాన్ని పకదారి పట్టిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి మిల్లర్లపై క్రిమినల్ కేసులతోపాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ను ప్రయోగించి 125% క్యాష్ రికవరీ వసూలు చేస్తున్నామని వెల్లడించారు. డిఫాల్ట్ మిలర్లను, అక్రమారులను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికే మిల్లర్ల నుంచి 90% రికవరీ చేశామని తెలిపారు. మిగిలిన పది శాతాన్ని కూడా రికవరీ చేసేందుకు పౌరసరఫరాల యంత్రాంగంతోపాటు కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టారని వివరించారు.
ఇంటర్మీడియట్ గోదాంలు
ఇటీవల పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో బియ్యం అక్రమాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి, క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు గంగుల కమలాకర్ వెల్లడించారు. అక్రమాలను అరికట్టడానికి రాష్ట్రస్థాయి విజిలెన్స్ బృందాలు స్థానిక యంత్రాంగంతో కలిసి పనిచేస్తున్నాయని వివరించారు. ఈ యాసంగి సీజన్లోనూ రైతులకు ఇబ్బందులు లేకుండా, మిల్లర్లపై ఒత్తిడి కలగకుండా ఇంటర్మీడియట్ గోదాములను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న మిల్లింగ్ సామర్థ్యాన్ని వాడుకునేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. గత డిఫాల్టర్లకు, అక్రమాలకు పాల్పడే మిల్లర్లకు ఒక గింజనూ కూడా కేటాయించబోమని స్పష్టంచేశారు. సకాలంలో మిల్లింగ్ చేస్తున్నవారితోపాటు ఇంతవరకూ సీఎమ్మార్లో పాల్గొనని మిల్లర్లను సైతం ప్రోత్సహిస్తామని చెప్పారు. సకాలంలో సీఎమ్మార్ పూర్తి చేయడం, రేషన్ బియ్యం పకదారి పట్టకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.