నిజామాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ మొండి వైఖరితో 40 రోజులుగా రాష్ట్రంలోని రైస్మిల్ ఇండస్ట్రీ మూగబోయిందని.. 3,400 మిల్లుల్లో దాదాపు 94 లక్షల టన్నుల ధాన్యం పేరుకుపోయిందని రైస్మిల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీ మెహన్రెడ్డి ధ్వజమెత్తారు. రైతుల పరిస్థితిని అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొన్నదని, ఎఫ్సీఐ ద్వారా వెంటనే సేకరణ ప్రారంభించాలని కేంద్రానికి సూచించారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ అంశం పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైస్భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మోహన్రెడ్డి మాట్లాడుతూ గాలులకు తాటిపత్రులు చినిగి, వానలకు నిల్వ చేసిన ధాన్యం తడిసి చెడిపోతున్నదని చెప్పారు.
ఇప్పుడున్న పరిస్థితిలో ఆ ధాన్యం తినడానికి పనిచేయదని, బీరు తయారీ పరిశ్రమలకు అమ్ముకోవాల్సిందేనని చెప్పారు. రైస్మిల్లుల్లో జరుగుతున్న నష్టం జాతి నష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. కేంద్రం తీరుతో రాష్ట్రంలోని రైస్మిల్ ఇండస్ట్రీకి జీవన్మరణ సమస్య ఏర్పడిందని దుయ్యబట్టారు. జనాభాలో చైనాను దాటేస్తున్న తరుణంలో దేశం ఆహార వనరులను పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదని, ఇలాంటి సమయంలో రైస్మిల్ పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టడం సరికాదన్నారు.
రాజకీయ ఇబ్బందులను పరిశ్రమపై మోపొద్దని కేంద్రానికి సూచించారు. దశాబ్దాల చరిత్ర ఉన్న ఎఫ్సీఐని నిర్వీర్యం చేయొద్దని కోరారు. బియ్యం సేకరణ జరుగుతుందని బండి సంజయ్ చెప్తున్నప్పటికీ.. ఎఫ్సీఐ జీఎం ఆర్డర్ రాలేదంటున్నారని వాపోయారు.రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి 10లక్షల టన్నుల ధాన్యం అమ్మేందుకు సిద్ధం అవుతుంది. కేంద్రం కూడా ఎఫ్సీఐ ద్వారా బాయిల్డ్ రైస్ కానీ రా రైస్ కానీ తీసుకోవాలని కోరారు. సమావేశంలో జిల్లా రైస్ మిల్ సంఘం అధ్యక్షుడు దయానంద్ గుప్తా, ఉపాధ్యక్షుడు పెంబర్తి శ్రావణ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్ సభ్యులు పాల్గొన్నారు.