హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): బియ్యం సేకరణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా వాడుకోవడాన్ని ఖండిస్తున్నామని ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తూడి దేవేందర్రెడ్డి చెప్పారు. రాష్ట్రంపై రాజకీయంగా కక్ష సాధించేందుకు ఎప్పూడు లేనివిధంగా రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వలపై కేంద్రం తనిఖీలు చేస్తున్నదని ఆరోపించారు. స్వల్ప సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ బియ్యం స్టాకులను తిరస్కరించటం దుర్మార్గమని మండిపడ్డారు. శుక్రవారం ఫిల్మ్నగర్ క్లబ్లోని ఆడిటోరియంలో తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేందర్, ప్రతినిధులు వెంకట్రెడ్డి, సత్యనారాయణతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా దేవేందర్రెడ్డి మాట్లాడుతూ.. బియ్యం సేకరణ విషయంలో కేంద్రం ఆచరణ సాధ్యంకాని నిబంధనలను విధించడంతో తెలంగాణలో వ్య వసాయం, అనుబంధ రంగాలు, రైస్ మిల్లర్స్ సంక్షోభంలో చిక్కుకుంటున్నారని వివరించా రు. కేంద్రం అనాలోచి త, అసంబద్ధ విధానాలతో రెండేండ్లుగా ఇ బ్బందులకు గురవుతున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని నిబంధనలను తెలంగాణలోనే ఎందుకు అమలుచేయాల్సి వస్తున్నదో స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం రాజకీయ ప్రయోజనాల కోసం జై జవాన్..జై కిసాన్ నినాదాన్ని సమస్యగా మార్చిందని విమర్శించారు.
సీఎమ్మార్ నిలిపివేతతో మూతపడ్డ మిల్లులు
కేంద్రం అనాలోచిత నిర్ణయంతో రాష్ట్రంలో 42 రోజులుగా రైస్ మిల్లుల్లో బియ్యం సేకరణ నిలిచిపోయి, మిల్లులు మూతపడ్డాయని దేవేందర్రెడ్డి చెప్పారు. దీంతో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యంలో రూ.2,500 కోట్ల విలువైన 10 లక్షల టన్నుల ధాన్యం తడిసిముద్దయిందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో గత మూడు సీజన్ల నుంచి సుమారు 92.50 లక్షల టన్నుల ధాన్యం(సుమారు రూ.18వేల కోట్ల విలువైన సరుకు) మిల్లర్ల దగ్గర ఉన్నదని చెప్పారు. పంజాబ్, హర్యానాలో గోధుమల ఎగుమతిపై నిషేధాన్ని 14 రోజుల్లో రద్దు చేసి, 18 శాతం తరుగు రాయితీ ఇస్తూ కేంద్రం పూర్తిస్థాయిలో మద్దతు ధరకు కొనుగోలు చేసిందని గుర్తుచేశారు. తెలంగాణ నుంచి ధాన్యం సేకరణ విషయంలో నాలుగు నెలలైనా నిర్ణయం తీసుకోలేదని, దక్షిణాది రాష్ర్టాలపై ఉద్దేశపూర్వకంగా అణచివేతకు పాల్పడుతున్నదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఏ రాష్ట్రంలోనైనా మిల్లుల్లో తనిఖీలు ఉన్నాయా?
మిల్లుల్లో తనిఖీల పేరుతో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును దేవేందర్రెడ్డి తప్పుపట్టారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి తనిఖీలు ఇప్పటి వరకు చేపట్టారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పీఏసీఎస్, ఐకేపీ, డీసీఎంఎస్ ఏజెన్సీల ద్వారా పారదర్శకంగా కొనుగోలు చేసిందని చెప్పారు. ఎఫ్సీఐ ఆదేశాలతో 5, 6 సార్లు మిల్లులు బంద్ చేయడంతో 50 నుంచి 70 రోజుల మిల్లింగ్ సమయం కోల్పోయామని చెప్పారు. 42 రోజులుగా ఎఫ్సీఐ సీఎమ్మార్ తీసుకోకపోవటంతో నిల్వలు చెడిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. మిల్లులో పనిచేసే ఇతర రాష్ట్రాల హమాలీలు, కార్మికులు.. మిల్లుల బంద్లో స్వరాష్ట్రాలకు వెళ్లారని తెలిపారు. మిల్లులు నడవక కరెంటు బిల్లు, మెయింటనెన్స్, జీతాలు చెల్లించలేక మిల్లర్లు ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.