పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో విషాదం చోటుచేసుకుంది. ఆర్ఎఫ్సీఎల్లో (RFCL) పర్మినెంట్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారని మనస్థాపంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంబాపూర్ చెందిన ముంజ హరీశ్ (30) గతంలో ఆర్ఎఫ్సీఎల్లో కార్మికుడిగా పనిచేశాడు. అయితే కంపెనీలో శాశ్వత ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి తన వద్ద రూ.6.70 లక్షలు లంచంగా ఇచ్చాడు. ఎంతకూ ఉద్యోగం రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన హరీశ్.. కమాన్పూర్ మండల కేంద్రంలోని ఓ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
అంతకుముందు తన చావుగల కారణాలు వివరిస్తూ ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఉద్యోగం కోసం డబ్బులు ఇచ్చి మోసపోయానని, ఇలాగే మరో 780 మంది వద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేశారని అందులో పేర్కొన్నాడు. తన కుటుంబంతోపాటు వారందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.