నల్లగొండ : నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు, చేపట్టనున్న అభివృద్ధి పనులు, పట్టణంలో మౌలిక వసతుల కల్పన పై జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, స్థానిక శాసనసభ్యుడు నోముల భగత్ లు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు.
సీఎం కేసీఆర్ ఇటీవల హాలియా పర్యటనలో నియోజకవర్గ ప్రగతి సమీక్షలో ప్రత్యేకంగా హాలియా పట్టణ అభివృద్ధికి రూ.15 కోట్లు, నందికొండ మున్సిపాలిటీకి రూ.15 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్, ఆర్.డి.ఓ., మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, మున్సిపాలిటీ, ప్రజారోగ్య శాఖ ఇంజినీరింగ్ అధికారులతో హాలియా పట్టణంలో ఎం.పి.డి.ఓ. కార్యాలయంలో నందికొండ మున్సిపాలిటీలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్య మంత్రి ప్రకటించిన అభివృద్ధి పనుల పై ప్రాథమికంగా చర్చించారు. హాలియా పట్టణంలో మౌలిక వసతులు కల్పనకు రూ.9 కోట్ల అంచనాతో రోడ్లు, రూ.6 కోట్ల అంచనాతో డ్రైన్ లు నిర్మించాలని మున్సిపాలిటీ అధికారులు ప్రతి పాదనలు రూపొందించారు.
హాలియా మున్సిపాలిటీలో వెజ్, నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ 2 కోట్లతో నిర్మాణం చేసేందుకు టెండర్ ఖరారు చేశారు. కోటి రూపాయలతో వైకుంఠధామం నిర్మాణంకు టెండర్ అయినట్లు, పట్టణ ప్రగతి నిధులతో డి.ఆర్.సి.సెంటర్, కంపోస్టు షెడ్, డంప్ యార్డ్ అభివృద్ధి, 2 శ్వశాన వాటికలు టెండర్ దశలో ఉన్నట్లు హాలియా మున్సిపల్ కమిషనర్ వివరించారు.
షాదీఖానా నిర్మాణంపై ఎమ్మెల్యే చర్చించారు.
నందికొండ మున్సిపాలిటీలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం, షాదీఖానా, వైకుంఠ ధామాలు, చిల్డ్రన్ పార్క్, బస్ స్టాండ్, లైబ్రరీ, డ్రైనేజీ, సి.సి.రోడ్డు లు, మున్సిపాలితే కమ్యూనిటీ హాల్, పలు అభివృద్ధి పనుల పైచర్చించారు.
సమావేశంలో మిర్యాలగూడ ఆర్.డి.ఓ.రోహిత్ సింగ్, హాలియా మున్సిపల్ చైర్ పర్సన్ పార్వతమ్మ, తహశీల్దార్ మంగ, ప్రజా రోగ్య శాఖ ఎస్ ఈ కందుకూరి వెంకటేశ్వర్లు, హాలియా మున్సిపాలిటీ కమిషనర్ వేమా రెడ్డి, నందికొండ మున్సిపల్ వైస్ చైర్మన్ మంద రఘు వీర్, తహశీల్దార్ సైదులు, కమిషనర్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.