హైదరాబాద్, డిసెంబర్14 (నమస్తే తెలంగాణ): పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేయాలని, అందుకు అవసరమైన నిధులను మంజూరు చేస్తామని ఇరిగేషన్శాఖ అధికారులకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లోని సాగునీటి ప్రాజెక్టులపై సచివాలయంలో గురువారం భట్టితోపాటు మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు, కరీంనగర్ జిల్లాలో చిన్నకాళేశ్వరం ఇతర ప్రాజెక్టులు, నల్లగొండ జిల్లాలో ఎస్సెల్బీసీ టన్నెల్, డిండి, ఉదయసముద్రం, నక్కలగండి తదితర ప్రాజెక్టుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి రాష్ట్ర వ్యాప్తంగా ఏకీకృత విధానాన్ని రూపొందించాలని, వృథా ఖర్చులను అరికట్టాలని సూచించారు. అనంతరం మంత్రి కొమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. ఎస్సెల్బీసీ, ఉదయసముద్రం, డిండి, సింగరాజుపల్లి, పెండ్లి పాకాల, గొట్టెముకుల రిజర్వాయర్, పిల్లాయిపల్లి కెనాల్, నెల్లికల్లు లిఫ్ట్ పనులను పూర్తిచేయాలని సూచించారు. అందుకు ప్రభుత్వం నుంచి కావాల్సిన నిధులను మంజూరు చేయిస్తామని చెప్పారు.
మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వరప్రదాయనిగా రైతులు ఆశిస్తున్న సీతారామ ప్రాజెక్టు పనుల హెడ్ వర్స్కు, కాల్వల నిర్మాణానికి అయ్యే నిధులపై సమగ్ర నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, జైవీర్రెడ్డి, ఉత్తమ్ పద్మావతి, మందుల శామ్యూల్, బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, కుంభం అనిల్, బాలునాయక్ తదితరులు పాల్గొన్నారు.
మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఆపొద్దు: మండలి చైర్మన్ గుత్తా
సమీక్ష సమావేశానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి హాజరై ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా సస్యశ్యామలం కావాలంటే గత ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రాజెక్టుల పనులు ఆపకుండా త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రాజెక్టులను పూర్తి చేయడానికి తగినంత బడ్జెట్ను కేటాయించాలని కోరారు.