శ్రీశైలం : శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో పీహెచ్-2 పంప్ మోడ్ ద్వారా నీటి తరలింపు ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం విద్యుత్సౌధ డైరెక్టర్ వెంకటరాజం, జలసౌధ (ఈఎన్సీ) ఉన్నతాధికారి పెంటారెడ్డి బృందం ఆధ్వర్యంలో పంప్ స్విచ్ఆన్ చేశారు. సాగర్ బ్యాక్వాటర్ నుంచి శ్రీశైలం రిజర్వాయర్కు యూనిట్-1 టర్బైన్ ద్వారా రోజుకు 0.5 టీఎంసీల నీటిని పంపింగ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద ఆధారపడిన 3,600 గ్రామాల రైతాంగంతో పాటు వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణ కోసం శ్రీశైలం రిజర్వాయర్ ద్వారా రివర్స్ పంపింగ్ చేపట్టి నీటిని అందించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి ఆధ్వర్యంలో నీటి తరలింపును ప్రారంభించారు. ఈ మేరకు ఆయా గ్రామాలకు అవసరమైన 3 టీఎంసీల నీటిని తరలించేందుకు సుమారు వారం రోజుల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.