హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్.. భూముల లావాదేవీలను ఎంత సరళతరం చేసిందో, రెవెన్యూ వ్యవస్థను ప్రజలకు ఎంత చేరువ చేసిందో తెలిపే మరో ఉదాహరణ ఇది. తల్లిదండ్రులను కోల్పోయి అనారోగ్యంతో హైదరాబాద్ దవాఖానలో చికిత్స పొందుతున్న యువతికి భూమిని విరాసత్ చేసేందుకు రెవెన్యూ సిబ్బంది 150 కిలోమీటర్లు ప్రయాణించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లెకు చెందిన లోకుంట్ల సోమయ్య పేరిట ఎకరంన్నర భూమి ఉన్నది.
భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో సోమయ్యకు టీబీ సోకడంతో వివరాలు సమర్పించలేకపోయారు. దీంతో కొత్త పాస్బుక్ మంజూరు కాలేదు. గత ఏడాది సోమయ్య భార్యకు కూడా టీబీ సోకి మరణించింది. దీంతో వారి కూతురు పూజ అనాథగా మారింది. ఆమెకు కూడా టీబీ సోకింది. చికిత్స కోసం హైదరాబాద్లోని ఎర్రగడ్డ టీబీ దవాఖానలో చేరింది. విషయం తెలుసుకొన్న తొర్రూరు తాసిల్దార్ వేమిరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ధరణి పోర్టల్లోని ‘సక్సేషన్ వితవుట్ పీపీబీ’ ఆప్షన్ కింద పూజతో దరఖాస్తు చేయించారు. ఆమె పరిస్థితిని ఆర్డీవో ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, దరఖాస్తుకు అనుమతించారు. దీంతో పూజ ఈ నెల 1న విరాసత్ కోసం స్లాట్ బుక్ చేసుకొన్నది. కలెక్టర్ అనుమతితో తాసిల్దార్ సహా రెవెన్యూ బృందం శుక్రవారం తొర్రూరు నుంచి దవాఖానకు వచ్చారు. దవాఖానలో పూజ బయోమెట్రిక్ తీసుకొని అక్కడే విరాసత్ పూర్తి చేశారు. ఈ-పట్టా జారీ చేసి, అక్కడికక్కడే పూజకు అందజేశారు. ఒకప్పుడు భూ యజమాని ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, భూ లావాదేవీ కోసం కచ్చితంగా రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్లాల్సి వచ్చేది. ధరణితో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.