హైదరాబాద్ : భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల నిర్వహణపై సీఎం కేసీఆర్ మంత్రులు, ఉన్నతాధికారులతో మంగళవారం ప్రగతి భవన్లో చర్చించారు. భూ రికార్డుల సమస్యల పరిష్కారంపై చర్చించారు.
మిగిలిన భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. మండలం కేంద్రంగా మూడు రోజులకు ఒక మండలం చొప్పున 100 బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్, డీఆర్వో, ఆర్డీవోల ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే నేతృత్వంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సంబంధించిన అవగాహన సదస్సును ఈ నెల 11వ తేదీన ప్రగతి భవన్లో సీఎం కేసిఆర్ అధ్యక్షతన జరగనుంది. ఈ అవగాహన సదస్సుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు హాజరు కానున్నారు.