రాష్ట్ర ప్రభుత్వానికి ట్రెసా విజ్ఞప్తి
హైదరాబాద్, మార్చి 15 : రాష్ట్ర రెవెన్యూశాఖలో క్షేత్రస్థాయి సిబ్బందిని పెంచాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ప్రభుత్వాన్ని కోరింది. హైదరాబాద్లోని రెవెన్యూ భవన్లో మంగళవారం ట్రెసా రాష్ట్ర కార్యవర్గ అత్యవసర సమావేశం జరిగింది. ప్రభుత్వం వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియను చేపట్టిన నేపథ్యంలో క్యాడర్ స్ట్రెంత్పై సుదీర్ఘంగా చర్చించారు. పనిభారం ఆధారంగా పోస్టులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ట్రెసా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగ రవీందర్రెడ్డి, కే గౌతమ్కుమార్ మాట్లాడుతూ.. రెవెన్యూ అధికారులకు అనేక రకాల విధులున్నాయని గుర్తు చేశారు. గ్రామస్థాయి సమాచారాన్ని తాసిల్దార్లకు, గిర్దావర్లకు అందిస్తున్న వీఆర్వోలను ఇతర శాఖలకు పంపితే ఆయా విధులను నిర్వహించేందుకు ప్రత్యామ్నాయ క్యాడర్ను నిర్ధారించాలని కోరారు. వ్యవసాయ క్లస్టర్ల మాదిరిగా యూనిట్ ఏర్పాటుచేసి, వాటికి జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో విచారణాధికారులుగా అదనపు సిబ్బందిని కేటాయించాలని సూచించారు. కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షుడు మన్నె ప్రభాకర్, ఎండీ రియాజుద్దీన్, ఉపాధ్యక్షులు బాణాల రాంరెడ్డి, డీ మధుసూదన్, కే నాగమణి, మాధవిరెడ్డి, కో-ఆర్డినేటర్ నారాయణ్రెడ్డి, కార్యదర్శులు మనోహర్ చక్రవర్తి, సయ్యద్ మౌలానా, పల్నాటి శ్రీనివాస్రెడ్డి, వాణిరెడ్డి, శ్రీదేవి, చిల్లా శ్రీనివాస్, సతీశ్, ఆర్గనైసింగ్ సెక్రటరీ నజీమ్ ఖాన్, జాయింట్ సెక్రటరీ శ్రవణ్, కార్యవర్గ సభ్యులు సైదులు, 33 జిల్లాల జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.