హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : క్యూర్ పరిధిలో 10 అంతస్తుల్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం సచివాలయంలో క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల శాశ్వత భవనాల నిర్మాణం, భద్రాచలం దేవస్థానం అభివృద్ధి అంశాలపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో పొంగులేటి మాట్లాడారు.
ఈ ఏడాది క్యూర్ పరిధిలో లక్ష ఇండ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ప్రయోగాత్మకంగా తొలివిడతలో ప్రతి నియోజకవర్గానికీ 500 చొప్పున ఇండ్లు నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. క్యూర్ పరిధిలో 26 నియోజకవర్గాల్లో ఇప్పటికే దాదాపు 20 స్థలాలను గుర్తించినట్టు వెల్లడించారు. మిగిలిన ప్రాంతాల గుర్తింపును వేగవంతం చేసి ఈనెల 28లోగా అన్ని లొకేషన్లను ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు.