హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): మట్టి ఆరోగ్యంగా ఉంటేనే మనుషులు ఆరోగ్యంగా ఉంటారని, భూమిపై మానవ మనుగడ సాగుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్కు చెందిన ‘హార్ట్ఫుల్నెస్’ సంస్థ, ‘4 ఫర్ 1000’ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఆసియా-పసిఫిక్ రీజినల్ కాన్ఫరెన్స్’ బుధవారం కన్హ శాంతివనంలో ప్రారంభమైంది. మూడు రోజులపాటు కొనసాగే ఈ కాన్ఫరెన్స్లో మొత్తం 10 దేశాలకు చెందిన వ్యవసాయ మంత్రులు పాల్గొంటున్నారు. మట్టి ఆరోగ్యం, వ్యవసాయ ఉత్పత్తులు, వాతావరణ మార్పులపై చర్చించనున్నారు. బుధవారం ప్రారంభ కార్యక్రమంలో శ్రీరామచంద్ర మిషన్ చైర్మన్ దాజీ, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఫిజీ దేశ గ్రామీణాభివృద్ధి, విపత్తుల నిర్వహణ శాఖల మంత్రి సకియాసి రసేవ్ డిటోకా, 4 పర్ 1000 సంస్థ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ పాల్లూ, ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ థైరే బెర్త్లాట్, రాష్ట్రవ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. మట్టి అంటే మనిషికి జీవితాన్నిచ్చే ‘హీరో’ అని అభివర్ణించారు. ఆ ‘హీరో’ ఇప్పుడు కష్టాల్లో ఉన్నాడని తెలిపారు. ఈ ముప్పు నుంచి మనల్ని కాపాడుకోవడానికి సుస్థిర వ్యవసాయం, భూసార పరీక్షలు, హానికర రసాయనాల వాడకాన్ని తగ్గించడంతోపాటు ప్రజలకు, ప్రజాప్రతినిధులకు భూమి కాలుష్యంపై అవగాహన పెంచాలని కోరారు. ఫిజీ మంత్రి డిటోకా మాట్లాడుతూ.. పర్యావరణ మార్పులతో కలిగే అనర్థాలను తమ దేశం ఇప్పటికే అనుభవిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీరామచంద్ర మిషన్ దాజీ మాట్లాడుతూ.. తెలంగాణలో సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యల ఫలితంగా పచ్చదనం పెరిగి ‘హరిత తెలంగాణ’గా మారిందని కొనియాడారు. ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ థైరే బెర్త్లాట్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ సదస్సులకు హైదరాబాద్ ఒక అద్భుత వేదిగా, చిరునామాగా మారిందన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు మాట్లాడుతూ..
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో అటు వ్యవసాయ రంగాన్ని, ఇటు పచ్చదనాన్ని ఒకే సమయంలో పెంచగలిగామని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని రికార్డు సమయంలో పూర్తిచేసి.. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో అనూహ్య వృద్ధి సాధించగలిగామని తెలిపారు. భూమిని కాపాడుకోవాలంటే ఆధునిక వ్యవసాయ పద్ధతులకు మారాల్సిందేనని 4 పర్ 1000 సంస్థ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ పాల్లూ స్పష్టం చేశారు. కార్యక్రమంలో భారత్లోని జర్మనీ రాయబార కార్యాలయ వ్యవసాయ విభాగం కాన్సులర్ ఇగెంబోర్గ్ బయేర్, డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ సీఈవో షామిక్ ట్రెహాన్, సమున్నతి ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో అనిల్కుమార్, వ్యవసాయ వర్సిటీ మాజీ వైస్ చాన్స్లర్ ప్రవీణ్ రావ్, ఇక్రిశాట్ శాస్త్రవేత్త శైలేందర్కుమార్ పాల్గొన్నారు.