హైదరాబాద్/ హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ, వాటర్వర్క్స్, మున్సిపల్ పరిపాలన విభాగాల్లో అక్రమాలను వెలికితీసేందుకు 15 రోజుల్లో విజిలెన్స్ దాడులు జరుగుతాయని సీఎం రేవంత్రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ యంత్రాంగం పారదర్శకంగా పనిచేయాలని, ఇష్టానుసారంగా వ్యవహరించే అధికారులు ఇంటికెళ్తారని హెచ్చరించారు. శుక్రవారం హెచ్ఎండీఏ కార్యాలయంలో వాటర్వర్క్స్, మున్సిపల్ పరిపాలన, జీహెచ్ఎంసీపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన అనుమతుల ఫైల్స్ క్లియర్గా ఉండాలని స్పష్టంచేశారు. చాలా భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన ఫైల్స్ కనబడటంలేదని, నిర్మాణరంగంలో ఆన్లైన్లో లేకుండా ఇష్టానుసారంగా ఇచ్చిన అనుమతుల జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. హెచ్ఎండీఏ వెబ్సైట్ నుంచి చెరువుల డాటా ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. 3,500 చెరువుల సమాచారం ఆన్లైన్లో ఉండాల్సిందేనని స్పష్టంచేశారు. చెరువులు దురాక్రమణకు గురికాకుండా సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని సూచించారు. జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న సిబ్బందిలో వయసు పైబడినవారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని సీఎం సూచించారు. ఆస్తిపన్ను మదింపు కోసం డ్రోన్ కెమెరాలను ఉపయోగించే అంశంపై అధ్యయనం చేయాలని ఆదేశించారు.
ఖైరతాబాద్, ఫిబ్రవరి 23: హైదరాబాద్ మాదాపూర్లోని హైటెక్స్లో మార్చి 4 నుంచి 6 వరకు 50వ డెయిరీ పరిశ్రమ జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్టు ఐడీఏ తెలంగాణ చాప్టర్ చైర్మన్ సీహెచ్ రాజేశ్వర్రావు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శుక్రవారం సదస్సు పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సదస్సులో దేశ వ్యాప్తంగా పాడి రైతులు, పారిశ్రామికవేత్తలు, హాజరవుతారని తెలిపారు.