ఆదిలాబాద్, ఏప్రిల్ 16(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఓటమి భయం పట్టుకున్నదని, పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు కర్రుకాల్చి వాతపెడతారన్న భయంతోనే కొత్త డైలాగ్లు చెప్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్రెడ్డి.. ఇప్పుడు ఆగస్టు 15 అంటూ కొత్త డైలాగ్లు చెప్తున్నారని దుయ్యబట్టారు. ఆరు గ్యారెంటీలను విస్మరించి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో పెను రాజకీయ మార్పులొస్తాయని, రేవంత్రెడ్డి బీజేపీలో చేరుతారని, నంబర్ వన్ జంపింగ్ స్టార్ రేవంత్ అవుతారని చెప్పారు. రేవంత్రెడ్డి తమ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ కోసం కాకుండా ప్రధాని మోదీ కోసం పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని విమర్శించిన కాంగ్రెస్ నాయకులు దమ్ముంటే మీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకుడా? బీజేపీ నాయకుడా? చెప్పాలని సవాల్ విసిరారు.
మైనార్టీలు కాంగ్రెస్కు ఓటు వేస్తే బీజేపీకీ వేసినట్టేనని పేర్కొన్నారు. తమకు మూడింట రెండొంతుల మెజార్టీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామన్న బీజేపీ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను మాయం చేసే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. మేక్ ఇన్ ఇండియా, క్వింట్ ఇండియా, స్టార్టప్ ఇండియా కార్యక్రమాలు ఏమయ్యాయో కానీ, ‘బేచో ఇండియా’ కార్యక్రమాన్ని బీజేపీ అమలు చేస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థలను అదానీ, అంబానీలకు అమ్మేస్తే ఇక రిజర్వేషన్లు ఉండవని, ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాలు లేకుండా చేస్తారని హెచ్చరించారు.
పార్లమెంట్లో తెలంగాణ గొంతుక బీఆర్ఎస్
మతం పేరిట మంటలు పెడుతున్న బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో ప్రజలు ఆలోచించాలని కేటీఆర్ కోరారు. రాముడితో తమకు పంచాయితీ లేదని, ‘రాముడికి మొక్కుదాం. తెలంగాణకు పైసా ఇవ్వని బీజేపీని తొక్కుదాం’ అనే నినాదంతో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. 2026లో జరిగే నియోజకవర్గాల పునర్విభజన ద్వారా ఉత్తరాది రాష్ర్టాల్లో సీట్లు పెంచుకొని, దక్షిణాదిలో తగ్గించేందుకు బీజేపీ ఆలోచిస్తున్నదని, తెలంగాణలో సీట్లు తగ్గితే పార్లమెంట్లో మన గొంతుక వినిపించేవారే ఉండరని ఆందోళన వ్యక్తంచేశారు. పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని వివరించారు.
అత్రం సక్కు లాంటి సీనియర్ నాయకులు పార్లమెంట్లో ఉంటే పార్టీకి, రాష్ర్టానికి, ఆదిలాబాద్కు లాభ జరుగుతుందని కేసీఆర్ భావించి, టికెట్ ఇచ్చారని వివరించారు. అధికారంలో లేకపోతే కొంతమంది నాయకులు పార్టీని వదిలిపోతున్నారని, ఆదివాసీ నేత ఆత్రం సక్కు మాత్రం కార్యకర్తలపై నమ్మకం ఉంచి పోటీ చేస్తున్నారని చెప్పారు.
మే 13న రైతులు బుద్ధి చెప్పాలి
‘రైతుబంధు అడిగితే చెప్పుతీసి కొడుతా’నని కాంగ్రెస్ మంత్రులు అంటున్నారని, అలాంటి నేతలకు మే 13న రైతులే చెప్పులు తీసి బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ హయాంలో 70 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.70 వేల కోట్లు జమ చేశారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు, కరెంటు, విత్తనాలు, ఎరువులు, పంటల కొనుగోళ్ల డబ్బుల పంపిణీ సక్రమంగా కొనసాగిందని, కాంగ్రెస్ పార్టీ మాత్రం కరువును తీసుకొచ్చిందని తెలిపారు.
యువతను మోసం చేస్తున్న కాంగ్రెస్
బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే అందరి కంటే ఎక్కువగా 1,60,283 మందికి ఉద్యోగాలు ఇచ్చిందని కేటీఆర్ వివరించారు. ఇటీవల రేవంత్రెడ్డి ఇచ్చిన 32 వేల ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించినవేనని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా యువతను మోసం చేస్తున్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం టెట్ పరీక్ష ఫీజు రూ.400 పెడితే, తాము ఉచితంగా ఇస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు రూ.2 వేలు వసూలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ ప్రభుత్వం 5 వేల ఉద్యోగాలతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తే నాడు పాతికవేల ఖాళీలు ఉన్నాయని విమర్శించిన కాంగ్రెస్ ఇప్పుడు పది వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇచ్చిందని చెప్పారు.
కేసీఆర్ గిరిజన బంధువు
బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనుల రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచిందని, పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయడంతోపాటు సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించిందని కేటీఆర్ గుర్తుచేశారు. గిరిజన వీరుడు కుమ్రంభీం నినాదం ‘జల్, జంగిల్, జమిన్’ను కేసీఆర్ ఆచరణలో చేసి చూపెట్టారని వివరించారు. కాంగ్రెస్ పాలనలో గిరిజనులపై కాల్పులు జరిగాయని, రేవంత్రెడ్డి, మంత్రులు సిగ్గులేకుండా ఇంద్రవెల్లి పర్యటనలు చేస్తున్నారని మండిపడ్డారు. అమరవీరుల కుటుంబాలకు కాంగ్రెస్ నాయకులు క్షమాపణ చెప్పకుండా, గిరిజనులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.