పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పక్కనబెట్టి, కమీషన్లు, కాంట్రాక్టుల కోసం లక్షల ఎకరాలకు నీరందకుండా రేవంత్ చేస్తున్న ద్రోహం జిల్లా ప్రజలకు అర్థమైంది. నల్లమల బిడ్డనని పదపదే చెప్పుకోవడం తప్ప ఉద్ధరించిందేమీ లేదు. గతంలో మాదిరిగా కొడంగల్ ప్రజలు రేవంత్కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నరు. ఆయన మాటలు కోటలు దాటుతున్నాయ్.. చేతలు మాత్రం గడపదాటడం లేదు. – కేటీఆర్
హైదరాబాద్, జూన్ 14 (నమస్తేతెలంగాణ): ‘పాలమూరు ప్రాజెక్టును పక్కనబెట్టి ద్రోహం చేసినందుకు కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి ఓటమి తథ్యం.. కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలు తరిమికొట్టడం ఖాయం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ పక్కా అని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ఆదివారం హైదరాబాద్లోని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి నివాసంలో మహబూబ్నగర్ జిల్లా నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సభ్యత్వ నమోదు, ‘సర్’ ప్రక్రియపై సుదీర్ఘంగా చర్చించి సలహాలు సూచనలిచ్చారు. గడపగడపకూ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలను విడమరచి చెప్పాలని సూచించారు.
కరువును తరిమికొట్టింది కేసీఆరే..
రాష్ట్రం రాకముందు వలసలకు కేరాఫ్గా ఉన్న మహబూబ్నగర్ జిల్లాను అన్నింటా అగ్రస్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్కే దక్కిందని కేటీఆర్ కొనియాడారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి కరువును తరిమికొట్టారని స్పష్టంచేశారు. కానీ చేసిన అభివృద్ధిని చెప్పుకోవడంలో పార్టీ నాయకులు విఫలమయ్యారని చెప్పారు. కానీ కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలన తర్వాత కేసీఆర్ గొప్పతనం ప్రజలకు అర్థమవుతున్నదని పేర్కొన్నారు. 60ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు తాగు, సాగునీరు అందలేదని గుర్తుచేశారు. నాటినుంచి నేటి వరకూ కాంగ్రెస్ ద్రోహాన్ని కొనసాగిస్తూనే ఉన్నదని దుయ్యబట్టారు.