ఒక వ్యక్తికి అప్పు ఇచ్చేముందు.. మళ్లీ తిరిగి ఇవ్వగలిగే స్థోమత ఉన్నదో? లేదో? ఒకటికి రెండుసార్లు చూసుకుంటాం. తిరిగి చెల్లించలేరని తెలిస్తే అప్పు ఇస్తామా? తెలంగాణ పతారకు పాతర!
ఒక బ్యాంకు ఏదైనా సంస్థకు అప్పు ఇవ్వాలంటే.. దాని ఆర్థిక పరపతిని అంచనా వేస్తుంది. లాభాల్లో ఉన్నదా? నష్టాల్లో ఉన్నదా? తిరిగి చెల్లించగలదా? అని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. సంస్థ దివాలా తీసిందని తెలిస్తే రుణం మంజూరు చేస్తుందా?
ఒక రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్ఠంగా ఉన్నదని తెలిస్తేనే పరిశ్రమలు పెట్టుబడులు పెడతాయి. ఆ పరపతిని చూసే బ్యాంకింగ్, ఫైనాన్స్ సంస్థలు రుణాలిస్తాయి. కానీ.. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెప్పుకొంటే పెట్టుబడులు వస్తాయా? రుణాలు వస్తాయా? అభివృద్ధికి అవకాశం ఉంటుందా?
హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చిన్న లాజిక్ను మిస్ అయ్యింది. తెలంగాణ రాష్ట్రం అంటేనే దేశంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. పదేండ్లలోనే అన్ని రంగాల్లో అద్భుతంగా ఎదిగిందనే పేరు ప్రఖ్యాతులు తెలంగాణ సొంతం. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనను బోనులో పెట్టే క్రమంలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని చెప్పేందుకు విఫల యత్నం చేసింది. శ్వేతపత్రం ద్వారా తెలంగాణ అప్పులకుప్ప అయ్యిందంటూ ప్రచారం చేసింది. ఇప్పుడు ఢిల్లీలో కూడా అదే పని చేసింది. సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా రాష్ర్టానికి రావాల్సిన నిధులను అడగడంతోపాటు రాష్ట్రం అప్పులు, శ్వేతపత్రంపై నివేదిక ఇచ్చామని వారు చెప్పారు. వారి వ్యాఖ్యలపై రాజకీయ, ఆర్థిక నిపుణులు విస్మ యం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా అప్పులు దాచుకొని, ఆస్తులు చెప్పుకొంటారని, అప్పుడే ఇతరుల దృష్టిలో పతార ఉంటుందని, మార్కెట్లో విలువ ఉంటుందని పేర్కొంటున్నారు. అప్పుడే రాష్ర్టానికి పెట్టుబడులు తరలి వస్తాయని, కేంద్రంగానీ, ఇతర ఆర్థిక సంస్థలుగానీ రుణాలు మంజూరు చేస్తాయని చెప్తున్నారు. దివాలా తీసిందని స్వయంగా ప్రచారం చేసుకొంటే ఏం విలువ ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.
కొన్నేండ్లుగా కేంద్రంలోని ప్రభుత్వం నయానో, భయానో ఇతర రాష్ర్టాలకు రావాల్సిన కంపెనీలను తమ అనుకూల రాష్ర్టాలకు తరలించుకుపోతున్నది. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులను సైతం ఎదురించి తెలంగాణ పారిశ్రామిక రం గం అనేక పెట్టుబడులను సాధించింది. ఇప్పు డు రాష్ట్రం దివాలా తీసిందని చెప్తే పరిశ్రమలు వస్తాయా? అన్నది రాష్ట్ర పాలకులు ఆలోచించలేదా? అని రాజకీయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ హకుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దేశ ప్రధానిని కలవడం మంచి పరిణామమే అని, కేం ద్రంతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ రా ష్ట్ర అభివృద్ధికి దోహదం చేయాలని చెప్పారు. కానీ రాష్ట్రం అప్పుల్లో ఉన్నదని, అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశామని చెప్పుకోవడం ఇబ్బందికరమైన అంశమేనని అంటున్నారు. ఏకంగా సీఎం, డిప్యూటీ సీఎంలే కేంద్రానికి ఫిర్యాదు చేస్తే రాజకీయంగా మనల్ని మనం అవమానించుకోవడం కాదా?.. రాజకీయంగా ప్రత్యర్థి అయిన బీజేపీకి ఒక అస్త్రం ఇచ్చినట్టు కాదా? అని ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా అంతర్జాతీయ పెట్టుబడులు కేంద్రం ద్వారానే రాష్ర్టాలకు వస్తుంటాయని గుర్తు చేస్తున్నారు. ఏదైనా కంపెనీ తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి కంపెనీలు కేంద్రం సలహా తీసుకొంటే.. అప్పుల్లో ఉన్నదని చెప్తే పరిస్థితి ఏమిటని అడుగుతున్నారు. వాస్తవానికి రాష్ర్టాల ఆదాయ, వ్యయాల్లో కేంద్రం జోక్యం చేసుకోదని చెప్తున్నారు. మనం అప్పుల్లో కూరుకుపోయామని చెప్పి, ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచాలని కోరితే కేంద్రం అంగీకరిస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు.
రాష్ర్టాన్ని అప్పులకుప్పగా చూపెట్టే క్రమం లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సాధించిన ఘనతలను మరుగునపడేస్తున్నదని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఆర్బీఐ తాజా నివేదిక ప్రకారం అత్యధిక సొంత పన్ను రాబడులు ఉ న్న రాష్ట్రంగా తెలంగాణ ఉన్నదని గుర్తు చేస్తున్నారు. మొత్తం ఆదాయంలో 84.2 శాతం సొంత పన్ను రాబడులే ఉన్నాయని తెలిపారు. జీఎస్డీపీతో పోల్చినప్పుడు అతి తక్కువ అప్పు లు చేసిన రాష్ర్టాల్లో తెలంగాణ కింది నుంచి ఐదో స్థానంలో ఉన్నదని అన్నారు. ఇది రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి నిదర్శనమని తెలిపారు. నా స్కామ్ ఇండియా తాజాగా విడుదల చేసిన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక జీసీసీలు ఉన్న నగరంగా హైదరాబాద్ నిలిచిందని గుర్తు చేస్తున్నా రు. తద్వారా ప్రపంచ ఐటీ రంగంలో ప్రముఖస్థానాన్ని సొంతం చేసుకున్నదని చెప్పారు. మెర్సెస్ సంస్థ ఈ ఏడాది విడుదల చేసిన ‘క్వాలిటీ ఆఫ్ లివింగ్ -2023’ నివేదికలో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచిందని, ఇది వరుసగా ఆరోసారి అని గుర్తు చేస్తున్నారు. ఇలా జా తీయ, అంతర్జాతీయస్థాయిలో తెలంగాణ అనే క ఘనతలు సాధించిందని, కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలతో అవన్నీ మరుగునపడే ప్ర మాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.