Runamafi | హైదరాబాద్, మే 17(నమస్తే తెలంగాణ): రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇస్తున్న హామీలు, చెప్తున్న మాటలు ఆచరణ సాధ్యమా? అనే చర్చ జోరుగా నడుస్తున్నది. ముఖ్యంగా ఎఫ్ఆర్బీఎం పరిధిలోనే అప్పు తీసుకొని రుణమాఫీ చేస్తామంటున్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ఆర్థికరంగ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. సీఎం చెప్పినట్టు సాధ్యమవుతుందా? లేదా? అని లెక్కలు వేస్తున్నారు. రాష్ర్టానికి మొత్తం ఎంత అప్పు తీసుకోవచ్చు? వాటిని ఏయే కార్యక్రమాలకు వినియోగిస్తారు? రుణమాఫీని కూడా ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి తీసుకొస్తే, ఇక తెచ్చుకునే అప్పులో మిగిలేది ఎంత? ఆ మిగిలిన దాంతో ఇతర పథకాలు నడుస్తాయా? అనే అంశాలపై చర్చ జరుగుతున్నది. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న ఒకేసారి రుణమాఫీ చేస్తామంటూ సీఎం రేవంత్రెడ్డి రైతులకు ఆశపెట్టారు. కానీ, అది సాధ్యం కాలేదు. తాజాగా లోక్సభ ఎన్నికల సందర్భంగా ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేసి తీరుతానని సీఎం రేవంత్రెడ్డి ఒట్టు పెట్టారు. ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటుచేసి రైతుల రుణం మొత్తాన్ని బ్యాంకుల నుంచి కార్పొరేషన్కు బదిలీ చేయించుకుంటామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి చెప్పినట్టుగా ఆగస్టు 15 నాటికి రుణమాఫీ అవుతుందా? లేదా? కార్పొరేషన్ ఏర్పాటుతో ఇది సాధ్యమవుతుందా? లేదా? అనే అంశంపై ప్రధానంగా చర్చ జరుగుతున్నది.
రాష్ట్ర జీఎస్డీపీ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి వార్షిక రుణ పరిమితి విధిస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర జీఎస్డీపీ రూ.14 లక్షల కోట్లు. ఈ లెక్కన ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.52 వేల కోట్ల రుణం తీసుకునేందుకు వెసులుబాటు ఉన్నది. ఇందులో ఒక్క రుణమాఫీ కోసమే రూ.40 వేల కోట్లు వినియోగిస్తే.. ఇక మిగిలేది రూ.12 వేల కోట్లు. ఈ నేపథ్యంలో మిగిలిన పథకాల పరిస్థితి ఏమిటనే ప్రశ్న వినిపిస్తున్నది. మరోవైపు, కాంగ్రెస్ ఇచ్చిన భారీ హామీలు రాష్ట్ర ఆర్థికంగానికి పెను సవాల్ అనే అభిప్రాయాలున్నాయి. ప్రస్తుత పరిస్థితిలో రాష్ట్ర రాబడితోపాటు అప్పులు తీసుకుంటే తప్ప ఆయా పథకాలు అమలయ్యే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రుణంలో అధిక మొత్తం రుణమాఫీకే కేటాయిస్తే, మిగిలిన పథకాలకు కోత తప్పదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రుణమాఫీతోపాటు రైతుభరోసా కింద ఎకరాకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు, వరికి క్వింటాకు రూ.500 బోనస్, ప్రతి మహిళకు నెలకు రూ.2,500, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు, చేయూత పింఛన్ రూ.4 వేలు, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇలా అనేక పథకాలను అమలు చేయాల్సి ఉన్నది. ఇవన్నీ నెరవేర్చాలంటే ఆర్థిక భారం తడిసి మోపెడు అవుతుందని ఆర్థికరంగ నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రుణపరిమితిలో మెజార్టీ రుణాన్ని రుణమాఫీకి కేటాయిస్తే, మిగిలిన పథకాలను అమలుచేయడం అసాధ్యమనే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు.
ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్తున్న మాటలు సాధ్యమయ్యే పరిస్థితి లేదంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇందుకు పలు కారణాలను ఉదహరిస్తున్నారు. ముఖ్యంగా బ్యాంకులు తమ రుణాన్ని కార్పొరేషన్కు బదిలీ చేసేందుకు ఒప్పుకుంటాయా? అనే ప్రశ్న లేవనెత్తుతున్నారు. ఒకవేళ అంగీకరిస్తే రూ.40 వేల కోట్ల భారీ రుణాన్ని బ్యాంకులు ఒకేసారి బదిలీ చేసుకునేందుకు వీలుంటుందా? అనేది మరో ప్రశ్న. ఇది అసాధ్యమని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఇందుకు కేవలం ఇక్కడి బ్యాంకులు ఒప్పుకొంటే సరిపోదని, ఆర్బీఐ అనుమతి తప్పనిసరిగా అవసరమవుతుందని అంటున్నారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా అవసరం కావొచ్చని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేయనున్న కార్పొరేషన్కు ఆదాయాన్ని ఎక్కడి నుంచి చూపిస్తారనేది పెద్ద ప్రశ్న. ఏదో ఒక ఆదాయాన్ని చూపిస్తే.. ఇందుకు బ్యాంకులు సమ్మతిస్తాయా? అనేది మరో ప్రశ్న. ఇన్ని ప్రశ్నల నేపథ్యంలో ఆగస్టు 15లోపు రుణమాఫీ దాదాపు అసాధ్యమేనన్న అభిప్రాయాన్ని ఆర్థికరంగ నిపుణులు వ్యక్తంచేస్తున్నారు.