రవీంద్రభారతి, ఆగస్టు 20 : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల ఒక సమావేశంలో ఫీజు బకాయిలు రూ.2,300 కోట్లు అడ్వాన్స్గా బ్యాంకుల్లో డిపాజిట్ చేశామని ప్రకటించారని, ఏ బ్యాంకుల్లో డిపాజిట్ చేశారో, విద్యార్థులకు ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలని బీసీ నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి అబద్ధాలు చెప్పడం తన రాజకీయ జీవితంలో రేవంత్రెడ్డినే చూశానని పేర్కొన్నారు. గురువారం బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో బీసీ నేతలు జిల్లపల్లి అంజి, నీలా వెంకటేశ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి వచ్చిన ఎంపీ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్కు బడ్జెట్ ఇవ్వకుండా సీఎం పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో వివిధ కాలేజీల్లో 4 లక్షల మంది విద్యార్థుల కోర్సులు పూర్తయ్యాయని, యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో పైచదువులకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం దిగొచ్చేవరకూ ఫీజు ఉద్యమాన్ని ఆపేదిలేదని స్పష్టంచేశారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఏటా రూ.2వేల కోట్ల ఫీజులు చెల్లించి విద్యార్థులను పైచదువులకు పంపించారని, విదేశీ విద్య కోసం రూ.25 లక్షలు ఇచ్చిన ఘనత కేసీఆర్దేనని గుర్తుచేశారు. రూ.9వేల కోట్ల ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లు, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడించనున్నట్టు తెలిపారు. పాలిటెక్నిక్ విద్యార్థుల ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు.