హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక రంగాన్ని ( Workers ) పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) ఆరోపించారు. సరైన పని దినాలు, వసతులు కల్పించక ఇబ్బందులపాలు చేస్తున్నారని విమర్శించారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ జెండాను ఎగురవేసి మేడే శుభాకాంక్షలు తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులకు చేతినిండా పని కల్పించి ఆదుకున్నామని, నగరంలో రోడ్లు, వంతెనల నిర్మాణం చేపట్టామని వెల్లడించారు. కోవిడ్ సమయంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు కార్మికులకు ఉచిత రైళ్లను కేసీఆర్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో అవినీతి వల్ల, అసమర్ధత వల్ల ఎస్ఎల్బీసీ కుప్పకూలిపోయి చనిపోయిన కార్మికులను అప్పగించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు.

సంగారెడ్డి జిల్లా సిగాచీ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగి 60 మంది సజీవదహనం అయితే పట్టించుకున్న నాథులే లేరని దుయ్యబట్టారు. కోటి రూపాయల నష్ట పరిహారం ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఇవ్వలేదని విమర్శించారు. నగరంలో వలసవచ్చి నివాసమేర్పచుకున్న కార్మికుల ఇళ్లను హైడ్రా పేరిట కూల్చి రోడ్డుపాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పాలనలో కూల్చివేతలు, ఎగవేతలు, పేల్చివేతలు మాత్రమే జరుగుతున్న ఇచ్చిన 420 హామీలు ఇచ్చారని తెలిపారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు, ఎన్నికలకు ముందు దాన,వీర, శూర కర్ణ. ఎన్నికల తరువాత కుంబకర్ణ పాత్రను ఫోషిస్తున్నాడని దుయ్యబట్టారు.