రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డే ఉరితాడుగా మారారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి సీనియర్లను బయటికి పంపి కాంగ్రెస్ పార్టీని బీజేపీకి అమ్మే పనిలో రేవంత్ ఉన్నారు. ఆయన బీజేపీ కోవర్ట్ అనే అనుమానం కలుగుతున్నది. రేవంత్ నాయకుడు అఖిల భారత పప్పు అయితే.. రేవంత్ తెలంగాణకు పప్పుగా తయారయ్యారు. పరిగిలో రేవంత్రెడ్డి కల్లు తాగిన కోతిలా వ్యవహరించారు. వ్యవసాయం గురించి కాంగ్రెస్ మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నది. దేశంలో అత్యధిక రైతు ఆత్మహత్యలు జరిగింది కాంగ్రెస్ హయాంలోనే. ఆ పార్టీ దశాబ్దాల పాటు దేశాన్ని పాలించి రైతులను అరిగోస పెట్టింది. –ప్రభుత్వ విప్ బాల్క సుమన్
హైదరాబాద్, ఫిబ్రవరి 27 : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డే ఉరితాడుగా మారారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి సీనియర్లను బయటికి పంపి కాంగ్రెస్ పార్టీని బీజేపీకి అమ్మే పనిలో రేవంత్ ఉన్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్, పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ విమర్శించారు. ఆయన బీజేపీ కోవర్ట్ అనే అనుమానం కలుగుతున్నదని చెప్పారు. రేవంత్ నాయకుడు అఖిల భారత పప్పు అయితే.. రేవంత్ తెలంగాణకు పప్పుగా తయారయ్యారని ఎద్దేవా చేశారు. ఆయనకు విషం తప్ప, విషయ పరిజ్ఞానం లేదని మండిపడ్డారు. ఓటుకు నోటు కేటుగాడు పెద్ద పోటుగాడిలా పోజు కొడుతున్నాడని ఎద్దేవాచేశారు. ఆదివారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో బాల్క సుమన్, జీవన్రెడ్డి, మాగంటి గోపీనాథ్ మీడియాతో మాట్లాడారు. పరిగిలో రేవంత్రెడ్డి కల్లు తాగిన కోతిలా వ్యవహరించారని బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. వ్యవసాయం గురించి కాంగ్రెస్ మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నదని మండిపడ్డారు. దేశంలో అత్యధిక రైతు ఆత్మహత్యలు జరిగింది కాంగ్రెస్ హయాంలోనేనని, ఆ పార్టీ దశాబ్దాల పాటు దేశాన్ని పాలించి రైతులను అరిగోస పెట్టిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడూ లేరని, సమైక్యవాదుల చెప్పులు మోశారని విమర్శించారు. ఇటీవల ఆయన మాట్లాడిన ఇంగ్లిష్ను చూసి జనం నవ్వుకొంటున్నారని ఎద్దేవా చేశారు. జైలులో చిప్ప కూడు తిన్న రేవంత్కు చిప్ దొబ్బిందని, రేవంత్ను తక్షణమే ఎర్రగడ్డ మెంటల్ దవాఖానలో చేర్పించాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి సుమన్ సూచించారు.
మన పార్టీ- మన పోరుగా మార్చుకో: జీవన్రెడ్డి
ఓటుకు నోటు కేటుగాడు పెద్ద పోటుగాడిలా పోజు కొడుతున్నాడని జీవన్రెడ్డి మండిపడ్డారు. తుపాకి రాముడి తుప్పు మాటలతో కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణకు ఒరిగేదేమీ లేదన్నారు. తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలను కొల్లగొట్టిన పార్టీల జెండాలు మోసిన రేవంత్, ఇపుడు చిలక పలుకులు పలుకుతున్నారని విమర్శించారు. బాయిల్డ్ రైస్ కొనబోమన్న కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేసి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్పై నోరు పారేసుకుంటే వచ్చే లాభం ఏమీ లేదని స్పష్టంచేశారు. రేవంత్ తన కార్యక్రమం పేరు ‘మన పార్టీ- మన పోరు’ అని మార్చుకుంటే మంచిదని సూచించారు. రేవంత్కు కళ్లు దొబ్బి, కుళ్లు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్పై రేవంత్ తన వ్యాఖ్యలు వెనకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్ సన్ ఆఫ్ కరప్షన్లా మారారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని రేవంత్ అడిగిన ప్రశ్నకే పార్లమెంటులో కేంద్రం జవాబిచ్చిందని గుర్తు చేశారు. అయినా రేవంత్ లోఫర్లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్పై నోరు పారేసుకొంటే రేవంత్ను ఊరంతా ఉరికించి కొట్టే రోజులు ఎంతో దూరంలో లేవని హెచ్చరించారు.
ఇంటి నుంచి కాలు బయటపెట్టలేవు: మాగంటి
తాము తలుచుకుంటే రేవంత్రెడ్డి ఇంటి నుంచి కాలు కూడా బయట పెట్టలేరని హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హెచ్చరించారు. ‘జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరుగుదాం రా.. అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తాం’ అని సవాలు చేశారు. రేవంత్రెడ్డి అవినీతి నిర్మూలన అంటూ మాట్లాడటం చూసి జనం నవ్వుకొంటున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ అవినీతిపరుడు కాకపోతే జూబ్లీహిల్స్లో ఇన్ని ఇండ్లు, స్థలాలు ఎకడినుంచి వచ్చాయని ప్రశ్నించారు. రేవంత్ బ్లాక్ మెయిల్ గురించి ఎవ్వరిని అడిగినా చెప్తారని తెలిపారు. సీఎం కేసీఆర్ కుటుంబం గురించి రేవంత్ మాట్లాడితే, ఆయన కుటుంబం, కాంగ్రెస్ నేతల కుటుంబాల గురించి తాము మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు. పీసీసీ అధ్యక్షుడిగా హుందాగా ఉంటే మంచిదని హితవు చెప్పారు.
తెలంగాణ పాలిట తాలిబన్
తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలకు కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్. కేసీఆర్ తెలంగాణ బంధు అయితే, రేవంత్ తెలంగాణ పాలిట తాలిబన్లా మారాడు. అభివృద్ధి తెలంగాణ ప్రజల జన్మ హకు అయితే, అవినీతి అబద్ధాలు రేవంత్ జన్మ హకులా మారిపోయాయి. కాంగ్రెస్కు ప్రజలు ఎపుడో ఉరి వేశారు. రేవంత్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. – జీవన్రెడ్డి
కార్యకర్తలే ఉరేస్తారు
ఒడిశాలోని సింగరేణికి చెందిన బొగ్గు బ్లాక్లో రూ.50 వేల కోట్ల కుంభకోణం జరిగిందని రేవంత్ అంటున్నారు. అసలు ఆ కోల్బ్లాక్లో బొగ్గు విలువ కూడా రూ.50 వేల కోట్లు లేదని ఆయనకు తెలుసా? సింగరేణి టర్నోవర్ ఎంతో తెలుసా? సింగరేణి ప్రైవేటీకరణను పార్లమెంటులో ప్రశ్నించాల్సింది పోయి, బీజేపీతో కుమ్మకై సీఎం కేసీఆర్ను రేవంత్ తిడుతున్నారు. ఆయన బీజేపీ కోవర్ట్ అనే అనుమానం కలుగుతున్నది. కాంగ్రెస్ కార్యకర్తలే రేవంత్కు ఉరితాడు బిగించే రోజులు ఎంతో దూరంలో లేవు. – బాల్క సుమన్
దమ్ముంటే నాపై పోటీచేసి గెలువు: ఎంపీ రంజిత్రెడ్డి
పరిగి: చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి సవాల్ విసిరారు. రేవంత్రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆదివారం పరిగిలోని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తనది పౌల్ట్రీ బిజినెస్ అని రాష్ట్రంలో అందరికీ తెలుసని, కోడిగుడ్లు అమ్మితే తప్పేమిటని ప్రశ్నించారు. ‘రేవంత్రెడ్డి.. నీకు దమ్ముంటే చేవెళ్ల ఎంపీగా నాపై పోటీ చేసి గెలిచి చూపించు. కానీ ఎలాంటి ఆధారాల్లేకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకొనేదిలేదు’ అని హెచ్చరించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై రేవంత్రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు.