హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎమ్మెల్యేల మద్దుతు కోల్పోయారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ.. మూడింట ఒక వంతు ఎమ్మెల్యేల మద్దతు కూడా ముఖ్యమంత్రికి లేదని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్రెడ్డి బలహీనుడిగా మారారని, కాంగ్రెస్లో పరిణామాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. రేవంత్రెడ్డిని తన కూతురితో టార్గెట్ చేయించిన మంత్రి కొండా సురేఖను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని వేం నరేందర్రెడ్డితో సీఎం ఫోన్ చేయిస్తే, 21 మంది మాత్రమే ప్రెస్మీట్ పెట్టారని తెలిపారు.
సురేఖపై వ్యక్తిగత కక్షతోనే సమావేశానికి హాజరయ్యారని చెప్పారు. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి భార్యతోపాటు, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తప్ప మిగతా ఎమ్మెల్యేలందరికీ ప్రెస్మీట్ పెట్టాలని ఫోన్ చేసి ఆదేశించారని పేర్కొన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు తమకు నిధులే ఇవ్వడం లేదని, రాలేమని తెగేసి చెప్పినట్టు వెల్లడించారు. మెజారిటీ ఎమ్మెల్యేల బలం లేకపోవడంతోనే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచనలో పడిందని వ్యాఖ్యానించారు.