ఖమ్మం కమాన్బజార్, జూన్ 7: పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు రావడం లేదనే సాకుతో రేవంత్ సర్కార్ బడులను మూసివేయడం దుర్మార్గమని ఏఐఎప్ఎఫ్ మండిపడింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నించింది. దీంతో ఏఐఎస్ఎఫ్ నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకొని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం పలువురి ఏఐఎస్ఎఫ్ నాయకులను అరెస్టు చేసి టూటౌన్ పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇటికాల రామకృష్ణ మాట్లాడుతూ.. ఒకప్పుడు వందలాదిమంది విద్యార్థులతో కళకళలాడిన పాఠశాలలు..
నేడు వెలవెలబోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. ప్రైవేట్ విద్యాసంస్థలను ప్రోత్సహించేందుకే ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం రేవంత్రెడ్డి విద్యాశాఖను గాలికొదిలేశారని విమర్శించారు. విద్య హకు చట్టం ప్రకారం ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీ విద్యార్థులకు 25శాతం ఫీజురాయితీ ఇవ్వాలనే నిబంధనలు ఉన్నా, పాటించడం లేదని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్, నాయకులు మాగం లోకేశ్, బుర్ర మనోజ్, పవన్, గోపి, రాము, ఉమేశ్, నరేందర్, సాయి, అభిరామ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.