మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ (ఎంజీకేఎల్ఐ) పథకంలో భాగంగా గుడిపల్లి వద్ద నిర్మించిన రిజర్వాయర్ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జలకళతో సందర్శకులను ఆకట్టుకున్నది. 2023 మార్చి 1వ తేదీన లిఫ్ట్లో మోటర్లు నడవడంతో నీటి పంపింగ్ కొనసాగింది. దీంతో 0.35 టీఎంసీల సామర్థ్యం ఉన్న గుడిపల్లి రిజర్వాయర్ నిండుకుండను తలపించింది. కాల్వలు నిండుగా పారడంతో యాసంగి సాగుకు ఢోకా లేకుండా రైతులు పంటలు పండించారు.
2023 డిసెంబర్ మొదటి వారం వరకు నీళ్లు పారినా తర్వాత జొన్నలబొగుడ నుంచి నీటి విడుదలను నిలిపివేశారు. దీంతో రిజర్వాయర్లో నీటిమట్టం పడిపోయింది. నిరుడు నిండుకుండలా ఉన్న ప్రాజెక్టు నేడు బోసిపోయింది. అట్టడుగు స్థాయికి చేరడంతో బండరాళ్లు తేలి దర్శనమిస్తున్నాయి.
గోదావరిలో వేల క్యూసెక్కుల ప్రవాహం ఉన్నది..
ఎత్తిపోసే నాథుడు లేడు!
అన్నారంలో 2.5 టీసీఎంల నీళ్ల నిల్వ ఉండె..
ఉత్త పుణ్యానికి వదిలేశారు!
పంపుహౌజుల్లో మోటర్లు సిద్ధంగా ఉన్నాయి..
ఎత్తిపోసేందుకు కరెంటు లేదు!
తెలంగాణలో సాగరాలు ఎదురుచూస్తున్నాయి..
నీళ్లను నింపే దిక్కు లేదు!
వాగులు పారించక, చెరువులు నింపక..పొలాలు ఎండిపోతున్నాయి!
ఉన్న నీరు వట్టిపోవటంతో భూగర్భం ‘బోరు’మంటున్నది!
కేసీఆర్ తప్పులెన్నటం కోసం కాళేశ్వరాన్ని కాంగ్రెస్ బలిపీఠంపై ఎక్కిస్తే.. ఆ పాపానికి నేడు రైతన్న బలవుతున్నాడు. కొన్ని నెలల కిందటి దాకా పచ్చని మాగాణంగా వెల్లివిరిసిన తెలంగాణ.. నేడు మళ్లీ ఎర్రగా ఎండిపోయి పడావు పడుతున్నది. పదేండ్ల కిందటి పాపపు కాలం మళ్లీ దాపురిస్తున్నది. 60 ఏండ్లు ఏడిపించిన కాటకం మళ్లీ కొత్త నాటకమై ఆడుతున్నది. కేసీఆర్ను విమర్శించేందుకు పెట్టిన సమయంలో సగమైనా రేవంత్ ప్రభుత్వం రైతుల కష్టంపై దృష్టి పెట్టి ఉంటే నేడు ఈ పరిస్థితి రాకపోవునేమో! కాలం కొంత కాలేదేమో.. కలిసి ఆలోచిస్తే ఈ కష్టాన్ని జయించేవాళ్లమే. కానీ, రేవంత్ ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని ఎండగట్టడంపై పెట్టిన దృష్టి రైతుల పంటలు ఎండిపోవటంపై పెట్టలేదు. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు!
Congress | హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది నిర్దేశించిన స్థాయిలోనే వర్షపాతం నమోదైంది. కృష్ణా ప్రాజెక్టులకు ఆశించిన స్థాయిలో వరదలు రాలేదు. గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులు మాత్రం పూర్తిస్థాయిలో నిండాయి. అయినా గోదావరి బేసిన్లోనూ ప్రాజెక్టుల కింద పంటలు ఎండిపోతున్న దుస్థితి నెలకొన్నది. అందుకు ప్రధాన కారణం కాం గ్రెస్ ప్రభుత్వం అవగాహన రాహిత్యం, అనాలోచిత నిర్ణయాలేనని తేటతెల్లమవుతున్నది. ప్రభుత్వం తీరుతో పంటలు ఎండిపోతుండగా, రాష్ట్ర రైతాంగం ఆగమాగమవుతున్నది. నష్టాల బారినపడుతున్నది.
గత బీఆర్ఎస్ సర్కారు ప్రణాళికబద్ధంగా సాగు, తాగునీటి ఎద్దడి లేకుండా చూసేది. చెరువుల సంరక్షణ, పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టిని సారిస్తూ వచ్చింది. తద్వారానే రెండు పంటలకు సాగునీటి భరోసా లభించింది. యాసంగిలోనూ నిరందిగా పంటలు పండించుకునే పరిస్థితి ఉండేది. బీఆర్ఎస్ సర్కారు రాష్ట్రంలోని వేల చెరువులను అక్కడి మేజర్, మీడియం ప్రాజెక్టులకు అనుసంధానం చేసింది. ప్రధాన గోదావరిలో ఎగువ నుంచి ప్రవాహాలు తగ్గిన వెంటనే మేడిగడ్డ నుంచి ప్రాణహిత జలాలను ప్రధాన ప్రాజెక్టులకు ఎత్తిపోసేది. ఆ జలాలను ప్రాజెక్టుల ద్వారా చెరువులకు మళ్లించేది. ఏటా ప్రతి అక్టోబర్ లేదంటే డిసెంబర్లో చెరువులు, చెక్డ్యామ్లను క్రమం తప్పకుండా నింపుతూ ఉండేది. ఫలితంగా భూగర్భ జలాలు పడిపోకుండా ఉండేవి. 24 గంటల కరెంటుతో బోర్ల ద్వారా పంటలు పండేవి. చిన్న లిఫ్ట్లు కూడా సమర్థంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడింది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు ఈ ఏడాది ఆ పనేమీ చేయలేదు. వర్షాకాలంలో మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లలో నిల్వ చేసిన నీటిలో కొద్ది మొత్తం విడుదల చేసి వాటి పరిధిలోని చెరువులు, చెక్డ్యామ్లను ఇటీవలే నింపింది. అదీ అక్కడి స్థానిక రైతులు రోడ్డెక్కి డిమాండ్ చేస్తేనే. మిగతా చోట్ల చెరువులను నింపకపోవటంతో భూగర్భజల మట్టాలు భారీగా పడిపోతున్నాయి. కరెంటు కోతల వల్ల బోర్లు కూడా పూర్త్తిస్థాయిలో నడవని దుస్థితి నెలకొన్నది. నీళ్లు లేక ఒక చోట పంటలు ఎండుతుంటే.. నీళ్లున్నా కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయి.
ఎస్సారెస్పీ స్టేజ్1లో అంటే ఎల్ఎండీకి ఎగువన అంటే ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాలువ 0-146 కిలోమీటర్ల వరకు 4,62,920 ఎకరాలు, దిగువన అంటే కాకతీయ కెనాల్ 146-284 కిలోమీటర్ల వరకు 5,05720 ఎకరాలు మొత్తంగా 9,68,640 ఎకరాల ఆయకట్టుకు నీరందించాల్సి ఉన్నది. కాకతీయ కాలువను 284 కిలోమీటర్ నుంచి 347 కిలోమీటర్ వరకు ఎస్సారెస్పీ స్టేజ్2గా పిలుస్తారు. దాని కింద 3,71,691 ఎకరాలు ఉన్నది. ఆ తర్వాత అది మూసీలో కలుస్తుంది. ఈ ఏడాది యాసంగిలో కూడా ఎస్సారెస్పీ స్టేజ్ 1, స్టేజీ2 కింద దాదాపు 11.26 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రతి ఏటా ఏ మేరకు నీరు తక్కువపడితే ఆ మేరకు జలాలను కాళేశ్వరం ద్వారా ఎత్తిపోస్తుండేవారు. నిరుడు దాదాపు 34 టీఎంసీలను కాళేశ్వరం ద్వారా ఎత్తిపోశారు. ఈసారి కూడా ఆ అంచనాతోనే అధికారులు ప్రణాళికలను సిద్ధం చేసినట్టు సమాచారం. కానీ ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉందన్న ధీమాతో అధికారులు ‘టెయిల్ టు హెడ్’ విధానం ప్రకారం, వారబందీని అమలు చేస్తూ స్టేజ్2కు సైతం నీరివ్వడం ప్రారంభించారు. ప్రస్తుతం అంచనా మేరకు నీటి నిల్వలు నిండుకున్నాయి. మరోవైపు ఈ ఏడాది మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటును సాకుగా చూపి నీటి ఎత్తిపోతలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపేసింది. ప్రాణహితలో ఇప్పటికీ 5 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నా ఎత్తిపోసేందుకు ససేమిరా అంటున్నది. ఇదిలా ఉంటే కాళేశ్వరం ద్వారా నీటిని ఎత్తిపోయకున్నా సుందిళ్ల, అన్నారంలో అప్పటికే నిల్వ ఉన్న నీళ్లనైనా ఎత్తిపోసి చెరువులను నింపినా ప్రస్తుతం పరిస్థితి వేరుగా ఉండేది. కానీ ప్రభుత్వం ఆ నీళ్లను సైతం వృథాగా దిగువకు విడుదల చేసింది. దీంతో ఆ నీటిని ఎత్తిపోసుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఎస్సారెస్పీ ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును, గత బీఆర్ఎస్ సర్కారును బద్నాం చేయాలని చూసింది తప్ప యాసంగి సాగునీటి అవసరాలు ఏమిటి? నీటిని ఎలా అందించటం? కార్యాచరణ ఏమిటి? అన్నదానిపై దృష్టి సారించలేదు. ఒకసారి మంత్రుల బృందం, మరోసారి సీఎం రేవంత్రెడ్డి స్వయంగా ప్రాజెక్టును సందర్శించారు తప్ప సాగునీటి అవసరాలపై మాత్రం అధికారులతో సమీక్షించింది లేదు. భవిష్యత్తు సాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా జలాలను ఎత్తిపోసుకోవాలనే దానిపై దృష్టి సారించటం లేదు. కనీసం యాసంగి సాగుకు సిద్ధమవుతున్న రైతులనైనా అప్రమత్తం చేసిందా! అంటే అదీ లేదు. ఆ దిశగా ఆలోచించిందీ లేదు.
ఈ ఏడాది చెరువులు, చెక్డ్యామ్లను నింపకపోవటం వల్ల భూగర్భజలాలు పడిపోతున్నాయి. దీనికి భూగర్భ జలశాఖ నెలవారీ నివేదికలే నిదర్శనం. బోర్లు నడవటం కష్టంగా మారింది. కరెంటు కోతలు కూడా కొనసాగుతుండటంతో బోరుబావుల ద్వారా వ్యవసాయం ప్రశ్నార్థకంగా తయారైంది. ఇప్పటికే పలు చోట్ల పంటలు ఎండిపోతుండగా, రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నది.
చిత్రంలో ఉన్న రైతు పేరు చందు గంగారాం. ఈయనకు కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బుడ్మి గ్రామశివారులో నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ కాలువ కింద మూడున్నర ఎకరాల పొలం ఉన్నది. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో విద్యుత్తు, సాగునీటి కొరత లేకపోవటంతో పుష్కలంగా పంటలు పండించుకునేవాడు. స్థానిక ఎమ్మెలే, మాజీ సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి రైతుల ఇబ్బందులను తెలుసుకొని పంటలను స్వయంగా పరిశీలించేవారు. సాగునీరు, విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకునేవారు. ప్రస్తుతం పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. పంటలకు సాగునీరు అందటం లేదు. ఒకవైపు ఎండలు రోజురోజుకూ మండుతుండగా.. మరోవైపు పొలాల్లో నీళ్లు లేక నెర్రెలువారుతున్నాయి. దీంతో పంటలను సాగు చేయటం కష్టంగా ఉన్నదని అంటున్నాడు. రైతులకు అవసరాన్ని బట్టి నీటి విడుదల చేపట్టడం ఒక ఎత్తయితే, లీకేజీ నీటిని నిత్యం వదలటంతో పంటలకు నష్టం కలిగే అవకాశం ఉన్నదని ఆందోళన చెందుతున్నాడు. యాసంగిలో సాగునీటి ఇబ్బందులు తప్పేలా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పుడున్న లీడర్లకు సాగునీరు, పంట పొలాల పరిస్థితిపై అవగాహన లేనట్టు ఉన్నదని, దీంతో రైతులు మళ్లీ రోడ్డెక్కే పరిస్థితులు వచ్చేలా ఉన్నాయని అంటున్నాడు.
మాది రామకిష్టాపూర్. ఏటా రెండు పంటలు సాగు చేసేటోన్ని. అదే ఆశతో ఈ సారి కూడా నాకున్న మూడెకరాల్లో వరి సాగుచేసిన. యాసంగిలో చివరి ఆయకట్టుకు ఇప్పటి వరకు చుక్క నీరు రాలేదు. సాగునీరందక భూమి నెర్రెలువాసింది. నీళ్లు రాకుంటే నష్టపోవటం తప్ప, వేరే దారి కనవడ్తలేదు.
– దండె రవి, రైతు, రామకిష్టాపూర్, పెద్దపల్లి జిల్లా