హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): రైతు భరోసాతోపాటు పలు ఇతర పథకాల అమలుకు నిధుల్లేక సతమతమవుతున్న రేవంత్రెడ్డి సర్కార్ మరోసారి ప్రభుత్వ భూముల విక్రయానికి సిద్ధమవుతున్నది. అందులో భాగంగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీజీఐఐసీ) ఆధ్వర్యంలోని భూములను విక్రయించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం ఉస్మాన్నగర్ గ్రామ సర్వే నంబర్ 30లోని 47.55 ఎకరాల్లో విస్తరించి ఉన్న మొత్తం 7 ప్లాట్లను ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించి రూ.3,500 కోట్లు సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ నెల 10 నుంచి 3 విడతల్లో జరిగే ఈ వేలంలో ఆఫ్సెట్ ధరను ఎకరాకు రూ.39 కోట్లుగా నిర్ణయించారు.
ఈ భూములు మల్టీ యూజ్ జోన్లో ఉండటంతో కమర్షియల్, రెసిడెన్షియల్, రిటైల్, హాస్పిటాలిటీ, హెల్త్కేర్, ఎంటర్టైన్మెంట్ తదితర అవసరాలకు ఉపయోగపడతాయి. దీంతో ఎకరా రూ.70-80 కోట్ల వరకు పలుకుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నంబర్ 1, 4 ప్లాట్లకు ఈ నెల 10న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే వేలంలో పాల్గొనాలనుకునేవారు 6వ తేదీలోగా, నంబర్ 2, 6, 9 ప్లాట్లకు 13న జరిగే వేలంలో పాల్గొనాలనుకునేవారు 11వ తేదీలోగా, నంబర్ 3, 7 ప్లాట్లకు 16వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలని స్పష్టం చేసిన టీజీఐఐసీ.. కనీస బిడ్ ఇంక్రిమెంట్ను రూ.25 లక్షలుగా నిర్ణయించింది. వేలంలో ప్లాట్లు దక్కించుకున్నవారు వాయిదాల పద్ధతిలో 90 రోజుల్లోగా పూర్తి మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం మరో 90 రోజుల గడువు ఇస్తారు. కానీ, ఈ 90 రోజులకు 12% వార్షిక వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
సర్కార్ ఆశలు నెరవేరేనా?
రాష్ట్రంలో హైడ్రాను ఏర్పాటు చేసి జలాశయాల పరిరక్షణ, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పేరుతో కాంగ్రెస్ సర్కార్ నిత్యం కూల్చివేతలు కొనసాగించడం, హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాల్లో భారీగా భూసేకరణకు నోటిఫికేషన్లు జారీచేయడం, పలుచోట్ల భూములను నిషేధిత జాబితాలో చేర్చడం తదితర కారణాలతో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైంది. దీంతో అపార్ట్మెంట్లు, ప్లాట్ల అమ్మకాలు జరుగక రియల్టర్లు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టీజీఐఐసీ భూముల వేలానికి ఏ మేరకు స్పందన వస్తుందన్న దానిపై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.