ఇల్లెందు, జూన్ 21 : పేదప్రజల కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తున్నదని ఉమ్మడి ఖమ్మంజిల్లా బీఆర్ఎస్ సభ్యత నమోదు ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు ఆరోపించారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో ఇల్లెందు నియోజకవర్గస్థాయి ఎస్ఐఆర్, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అధ్యక్షతన బీఎల్ఏలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ అధ్యక్షుడు రేగా కాంతారావు, ఇల్లెందు నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్చార్జి చాడా కిషన్రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు.
అనంతరం రవీందర్రావు మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు అందివ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, సానుభూతిపరులు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)పై అవగాహన కలిగి ఉండాలని, గ్రామాల్లో ఓట్లు గల్లంతు కాకుండా చూడాలని సూచించారు. బీఆర్ఎస్ సభ్యత్వ డిజిటల్ నమోదుపై చురుగ్గా పనిచేయాలని కోరారు. తాతా మధు మాట్లాడుతూ.. ఇల్లెం దు నియోజకవర్గంలో 30 నెలల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని చెప్పారు. రేగా కాంతారావు మాట్లాడుతూ.. ఉమ్మడి ఖ మ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు చేస్తున్న దోపిడీపై ప్రజలకు వివరించాలని సూచించారు. చాడా కిషన్రెడ్డి, హరిప్రియ మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ విషయంలో మహిళా ఓటర్ల మ్యాపింగ్ గురించి అవగాహన కలిగి ఉండాలని, 2025 ఓటరు లిస్ట్లో ప్రతి ఓటరును 2002 లిస్ట్లో ఉన్న వాళ్లతో లింక్ చేయడంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. సమావేశంలో ఏఎంసీ మాజీ చైర్మన్ బానోత్ హరిసింగ్నాయక్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.