దౌల్తాబాద్/మిడ్జిల్/ అమ్రాబాద్, నవంబర్ 28: రేవంత్రెడ్డి అనుచరుడు, కొడంగల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. హైదరాబాద్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే నరేందర్రెడ్డి సమక్షంలో సోమవారం టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికి దిశానిర్దేశం చేస్తున్నాయని శ్రీనివాస్ పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే అభివృద్ధి చేస్తున్న ఎమ్మె ల్యే పట్నం నరేందర్రెడ్డి అడుగుజాడల్లో నడుస్తానని చెప్పారు. కాగా, రెడ్డి శ్రీనివాస్ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఎదిగి, గత కొన్నేండ్లుగా కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నా రు. రేవంత్ ముఖ్య అనుచరుల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. గత ఎన్నికల్లో దౌల్తాబాద్ జెడ్పీటీసీగా పోటీ చేశారు. దౌల్తాబాద్ మండల పరిధిలోనే కాకుండా నియోజకవర్గంలోని యువతలో ఆయనకు మంచి గుర్తింపు ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఉంటూ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేశారు. గతంలో ఎమ్మెల్యేగా రేవంత్రెడ్డి గెలిచేందుకు కృషిచేశారు. ఇటీవల కాంగ్రెస్లో చోటుచేసుకున్న పరిణామాలతో పాటు, టీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమం అభివృద్ధి తదితర కారణాలతో టీఆర్ఎస్లో చేరినట్టు ఆయన తెలిపారు.
టీఆర్ఎస్లోకి వలసల జోరు
పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నదని, పథకాలను ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్లోని తన నివాసంలో మిడ్జిల్ మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బచ్చయ్య, నాగరాజు, అశోక్, శివరాజు, రవి మరికొంత మంది ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు. అలాగే ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన 20 మంది నాయకులు టీఆర్ఎస్లో చేరారు. సోమవారం నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని ప్రశాంత్నగర్ కాలనీలో ఎస్సీ కార్పొరేషన్, గ్రామస్తులు సంయుక్తంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక అభివృద్ధి సమావేశానికి విప్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాంలాల్, స్వామి, ఎంపీడీవో రామ్మోహన్, డీఎల్పీవో వెంకటయ్య, సర్పంచ్ శ్రీరాంనాయక్, పార్టీ మండలాధ్యక్షుడు రవీందర్రెడ్డి పాల్గొన్నారు.