Revanth Reddy | హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : ‘సర్ నమోదు ప్రక్రియలో రాష్ట్రంలోనే సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ చాలా వెనుకబడి ఉన్నది. ఆ జిల్లాలోని హుజూర్నగర్ నియోజకవర్గంలో అత్యల్పంగా ఎన్రోల్మెంట్ అయ్యింది. జిల్లాలో మందకొడిగా సర్ నమోదు ప్రక్రియ జరుగుతుందని గుర్తించాం’ అని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. హుజూర్నగర్లో పార్టీ కార్యకర్తలను ఇన్వాల్ చేయడంలో నిర్లక్ష్యం ఉన్నట్టు గుర్తించామని సీఎం వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై ఆదివారం సీఎం రేవంత్రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో నల్లగొండ, యాదాద్రి జిల్లాలు సర్ నమోదులో ముందంజలో ఉన్నాయని సీఎం చెప్పారు. కానీ సూర్యాపేట జిల్లా వెనుకబడి ఉన్నదని, ముఖ్యంగా జిల్లాలో హుజూర్నగర్ నియోజకవర్గంలో అత్యల్పంగా ఎన్రోల్ అయ్యిందని తెలిపారు.
10 రోజుల్లో ఎన్రోల్మెంట్ పెరుగాలని, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనేలా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పనిచేయాలని హెచ్చరించారు. దీంతో సీఎం తననుద్దేశించే వ్యాఖ్యానించారని జిల్లాకు చెందిన, హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ మంత్రి ఉత్తమ్ నొచ్చుకున్నట్టు సమాచారం. నియోజకవర్గం లో నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉన్న తనలాంటి సీనియర్ నేతను, జూమ్ సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించడమేమిటని ఉత్త మ్ తన సహచరులతో వ్యాఖ్యానించినట్టు తెలిసింది. జూమ్ మీటింగ్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నేతలను ఉద్దేశించి సీఎం రేవంత్ మాట్లాడుతూ ‘కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులెవరూ సోమవారం నుంచి ఆగస్టు 3 వరకు గాంధీభవన్కు రావద్దు.. పదవులు ఆశించి గాంధీభవన్కు వచ్చేవారికి ముఖ్య నేతలెవరూ అపాయింట్మెంట్లు ఇవ్వొద్దు’ అని సూచించారు.