హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): ‘అమ్మా… పింఛన్ ఎంత వస్తుంది? రెండు వేలే కదా? (రెండు వేళ్లు) చూపెడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నాలుగు వేలు (నాలుగు వేళ్లు చూపుతూ) వస్తుంది.. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది.. వెంటనే నాలుగు వేలు మీ అకౌంట్లో పడ్తాయి. ఇందిరమ్మ రాజ్యం వస్తే ఇచ్చే నాలుగు వేల పింఛను కావాలా? కేసీఆర్ ఇచ్చే రెండు వేల పింఛను కావాలో ఆలోచించుకోని ఓటు వేయండి’ ఇవీ పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచార సభల్లో చెప్పిన మాటలు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 45 రోజులు గడుస్తున్నా ఆ హామీ నీటిమూటే అయ్యింది. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు పింఛన్ పెంపుపై పెదవి కదపడం లేదు. ఈ పథకం అమలు చేయడానికి పెద్దగా అధికారిక ప్రక్రియ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఉన్న లబ్ధిదారులకు ఇచ్చే మొత్తాన్ని పెంచుతూ జీవో ఇస్తే సరిపోతుంది.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదు. ఆలోచన కూడా చేయలేదు. ఇప్పటివరకూ ఒక్కసారి కూడా చేయూత పింఛన్పై సమీక్ష చేయలేదు. వాటికి ఎంత మొత్తం అవుతుంది? ఎప్పటి నుంచి అమలు చేయాలి? అనే దానిపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు కనీసస్థాయిలో కూడా ఆలోచన కూడా చేసిన పాపానపోలేదు. గత నెలలో చేయూత పథకం కింద రూ.2016 చెల్లించారు. ఈ నెలలో కూడా రూ.2016 మొత్తాన్నే ఇవ్వాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దానికి అవసరమైన మొత్తాన్ని జిల్లాలకు జమ చేయడం ప్రారంభించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అసరా పథకాన్ని ‘చేయూత’గా మార్చి రూ.2016 మొత్తాన్ని రూ.4వేలు చేస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని మొదటి సారిగా 2023 జూలై 2న ఖమ్మం సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు వేలు ఇస్తామంటూ చెప్పారు. దానికి సంబంధించిన ప్రచార పత్రాన్ని రాహుల్ ఆ సభలో ఆవిష్కరించారు. కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి ప్రజలు వారికి ఓటు వేశారు. డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 45 రోజులు పూర్తయ్యింది.
డిసెంబర్లో ‘చేయూత’ పింఛను పాత మొత్తాన్నే అందించారు. తాజాగా జనవరి మొత్తాన్ని దశలవారీగా నిధులను విడుదల చేయడం ప్రారంభించారు. ఈ నెల గతంలో ఇచ్చిన మాదిరిగానే రూ.2016 ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినట్టుగానే రూ.2016 చెల్లించడానికి అవసరమైన నిధులనే విడుదల చేశారు. ప్రభుత్వం నుంచి చేయూత పింఛను మొత్తాన్ని పెంచాలని ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో అధికారులు పాత మొత్తానికి సంబంధించిన నిధులను జిల్లాలకు విడుదల చేయడం ప్రారంభించామని చెప్తున్నారు.
రాష్ట్రంలో మొత్తం 45 లక్షల మంది పింఛన్దారులున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బోధకాలు బాధితులు, బీడీ కార్మికులు, చేనేత, గౌడ వృత్తిదారులు, దివ్యాంగులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెల నుంచి పింఛన్ పెంచి ఇస్తారని ఆశలు పెట్టుకున్నారు. అయితే, కాంగ్రెస్ సర్కారు పాత పింఛనే ఇస్తున్నట్టు తెలియడంతో అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఎన్నికల ప్రచార సభల్లో చెప్పిందేమిటి? ఇప్పుడు చేస్తున్నదేమిటి? అని కాంగ్రెస్ సర్కారుపై మండిపడుతున్నారు. వచ్చే నెలలో ఏ రోజైనా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వస్తుందని, అప్పుడు పెంచిన మొత్తం ఇవ్వడం కష్టమని, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రూ.4 వేల పింఛన్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు.