హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సీఎం ఎవరనేది తేలిపోయింది. ఎట్టకేలకు రెండురోజుల ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్రెడ్డిని ఎంపిక చేస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకొన్నది. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలంగాణ కాంగ్రెస్ సీఎల్పీ నేతగా రేవంత్రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించారు. అంతకుముందు సీఎల్పీ నేత ఎంపికపై ఢిల్లీ వేదికగా కాంగ్రెస్లో వరుస పరిణామాలు చోటుచేసుకొన్నాయి. సీఎం రేసులో ఉన్న భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్రెడ్డి మంగళవారం ఉదయం హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు.
అక్కడ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్గాంధీ, కేసీ వేణుగోపాల్తో చర్చలు జరిపారు. అదే సమయంలో సోమవారం హైదరాబాద్లోని ఎల్లా హోటల్లో జరిగిన సీఎల్పీ సమావేశం వివరాలను, ఎమ్మెల్యేల అభిప్రాయాలపై నివేదికను డీకే శివకుమార్ అధిష్ఠానానికి అందించారు. భట్టి, ఉత్తమ్తో చర్చలు, నివేదికను పరిశీలించిన అధిష్ఠానం సీఎల్పీ నేతగా రేవంత్రెడ్డిని ఖరారు చేసింది. అదే సమయంలో ఉత్తమ్, భట్టి విక్రమార్కకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో వారు కూడా సీఎంగా రేవంత్రెడ్డిని అంగీకరించినట్టు సమాచారం. అనంతరం వారిద్దరి సమక్షంలోనే విలేకరుల సమావేశం నిర్వహించిన కేసీ వేణుగోపాల్.. సీఎల్పీ నేతగా రేవంత్రెడ్డి పేరును ప్రకటించారు. అనంతరం ఉత్తమ్కుమార్రెడ్డి మీడియాతో మాట్లాడకుండానే బయటకు వెళ్లిపోగా.. భట్టి విక్రమార్క ఈ అంశంపై స్పందించలేదు.
వన్మ్యాన్ షో ఉండదు
సీఎల్పీ నేతగా రేవంత్రెడ్డి ప్రకటించిన సమయంలో కేసీ వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సీనియర్లకు సముచిత గౌరవం ఉంటుందని, వారికి ఎలాంటి ఇబ్బంది ఉండబోదని తెలిపారు. అదే సమయంలో పార్టీలో, ప్రభుత్వంలో వన్మ్యాన్ షో (ఏకచత్రాధిపత్యం) ఉండబోదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలపై డీకే శివకుమార్, ఠాక్రే ఇచ్చిన నివేదికతోపాటు అధిష్ఠానం నిర్ణయం ప్రకారమే సీఎల్పీ నేతగా రేవంత్రెడ్డిని ఎంపిక చేసినట్టు ఆయన తెలిపారు.
రేపు ప్రమాణం
సీఎంగా రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఖరారైంది. సీఎల్పీ నేతగా ఎన్నికైన రేవంత్రెడ్డి.. సీఎంగా గురువారం (7వ తేదీ) ఉదయం ప్రమాణం చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో ఉదయం 10.30 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి మంగళవారం సమీక్ష నిర్వహించారు. అయితే రేవంత్రెడ్డి ఒక్కరే ప్రమాణం చేస్తారా? లేక ఆయనతోపాటు డిప్యూటీ సీఎం లేదా మంత్రులు ఎవరైనా ప్రమాణం చేస్తారా? అనేది తేలాల్సి ఉన్నది. ఈ సభలోనే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుపై కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నది.
ఢిల్లీకి రేవంత్
సీఎల్పీ నేతగా రేవంత్రెడ్డిని ఎంపిక చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం.. ఆయనను ఢిల్లీకి రావాలని ఆదేశించింది. దీంతో మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో రేవంత్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. సీఎంగా తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంకగాంధీలను ఆహ్వానించారు. దీంతోపాటు సీఎల్పీ నేతగా ఎంపిక చేసిన నేపథ్యంలో క్యాబినెట్ కూర్పుపై అధిష్ఠానంతో చర్చించినట్టు తెలిసింది. జిల్లాలవారీగా, కులాలవారీగా ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి? ఎవరికి ఏ శాఖ ఇవ్వాలి? అనే దానిపై అధిష్ఠానం ఆయనతో చర్చించినట్టు సమాచారం.
ఖర్గే, సోనియాకు కృతజ్ఞతలు..: రేవంత్రెడ్డి
సీఎల్పీ నేతగా తనను ఎంపిక చేసినందుకు అధిష్ఠానానికి రేవంత్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, మాణిక్రావ్ ఠాక్రేకు ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో పార్టీ కోసం నిరంతరం కష్టపడి ఈ విజయాన్ని కట్టబెట్టిన కార్యకర్తలకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు.
కార్యకర్తల సంబురాలు
రేవంత్రెడ్డి సీఎం కానుండటంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు సంబురాల్లో మునిగిపోయారు. సీఎల్పీ నేతగా రేవంత్రెడ్డి పేరును కేసీ వేణుగోపాల్ ప్రకటించగానే రాష్ట్రవ్యాప్తంగా పటాకులు కాల్చి, సంబురాలు చేసుకొన్నారు. సోషల్మీడియాలోనూ రేవంత్రెడ్డికి అభినందనలు వెల్లువెత్తాయి. చాలారోజుల తర్వాత గాంధీభవన్ కొత్త కళను సంతరించుకొన్నది. రంగులలైట్లతో గాంధీభవన్ను ముస్తాబు చేశారు.
రేవంత్ రెడ్డి కుటుంబ నేపథ్యం..
1969 ఆగస్టు 8న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట నియోజక వర్గంలోని కొండారెడ్డిపల్లెలో నరసింహారెడ్డి, రామచంద్రమ్మ దంపతులకు రేవంత్రెడ్డి జన్మించారు. ఆయనకు మొత్తం ఆరుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. పదోతరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివిన రేవంత్రెడ్డి ఇంటర్ ఓ ప్రైవేట్ కాలేజీలో పూర్తి చేశారు. అనంతరం డిగ్రీ చేసేందుకు హైదరాబాద్ వచ్చారు. ఉస్మానియా అనుబంధ ఏవీ కాలేజీలో డిగ్రీ (ఫైన్ ఆర్ట్స్) పూర్తి చేశారు. చిన్ననాటినుంచి నాయకత్వ లక్షణాలున్న రేవంత్ పాఠశాలలో చదివే రోజుల్లోనే స్టూడెంట్ లీడర్గా ఉన్నారు. దూకుడుగా, చురుగ్గా ఉండే రేవంత్రెడ్డి విద్యార్థుల సమస్యలపై పోరాడేవారు. ఏబీవీపీ స్టూడెంట్ యూనియన్లో మెంబర్గా చేశారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పెయింటర్గా కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత సోదరుడితో కలిసి ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించారు. అది విజయవంతం అవ్వడంతో.. రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రవేశించిన ఆయన ఆర్థికంగా నిలదొకుకొన్నారు. 1992లో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి జైపాల్రెడ్డి సోదరుడి కుమార్తె గీతారెడ్డిని ప్రేమ వివాహం చేసుకొన్నారు. వీరికి ఒక కుమార్తె ఉన్నారు.
ఓటుకు నోటు కేసులో..
2015లో తెలంగాణ శాసన మండలి ఎన్నికల సందర్భంగా టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలంటూ.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రేవంత్రెడ్డి లంచం ఇవ్వజూపారంటూ ఒక స్టింగ్ -ఆపరేషన్ వీడియోతో సహా ఆరోపణలు రావటంతో ఏసీబీ ఆయనను అరెస్టు చేసింది. 45 రోజులకుపైగా జైలు జీవితం గడిపి బెయిల్పై విడుదలయ్యారు. ఇది అప్పట్లో రాష్ట్రంలో సంచలనం రేపింది.
రేవంత్ రాజకీయ ప్రస్థానం
టీఆర్ఎస్ ఆవిర్భావంలోనే పార్టీలో చేరిన ఆయన.. తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 2004లో కల్వకుర్తి టికెట్ ఆశించినా.. కూటమి పొత్తుల్లో భాగంగా ఆ సీటు రేవంత్కు దకలేదు. 2006లో జడ్పీటీసీ ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. దీంతో టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన రేవంత్రెడ్డి.. 2008 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. ఎమ్మెల్సీగా గెలిచిన రేవంత్రెడ్డి.. టీడీపీలో చేరారు. టీడీపీలో యాక్టివ్గా పనిచేసిన రేవంత్రెడ్డికి చంద్రబాబు 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ టికెట్ కేటాయించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అనూహ్యంగా ఓటమి పాలైనా.. రేవంత్రెడ్డి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో మళ్లీ గెలుపొందారు. ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు, తెలంగాణలో టీడీపీ బలహీనంకావడంతో రేవంత్రెడ్డి ఆ పార్టీని వీడారు. 2017 అక్టోబర్లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొన్నారు. రేవంత్రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం టీపీసీసీ వరింగ్ ప్రెసిడెంట్గా నియమించింది. 2018లో బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2019 లోక్సభ ఎన్నికల్లో మలాజ్గిరి నుంచి పోటీ చేసిన రేవంత్రెడ్డి.. గెలుపొంది మొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు.
వన్మ్యాన్ షో ఉండదు
తెలంగాణలో సీనియర్లకు సముచిత గౌరవం ఉంటుంది. వారికి ఎలాంటి ఇబ్బంది ఉండబోదు. అదే సమయంలో పార్టీలో, ప్రభుత్వంలో వన్మ్యాన్ షో (ఏకచత్రాధిపత్యం) ఉండబోదు. కాంగ్రెస్ శాసనసభ్యుల అభిప్రాయాలపై డీకే శివకుమార్, ఠాక్రే నివేదిక ఇచ్చారు. దానిని పరిశీలించిన తర్వాతే అధిష్ఠానం నిర్ణయం ప్రకారమే సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేశాం.
-ఢిల్లీలో మీడియా సమావేశంలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్