AICC | న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనేది చివరి దశకు చేరుకుంది. మరికొద్ది గంటల్లో కాంగ్రెస్ పార్టీ సీఎం పేరును అధికారికంగా ప్రకటించనుంది. తెలంగాణ సీఎం ఎంపికపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్లు కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. అయితే రేవంత్నే సీఎం చేయాలని ఖర్గే నేతృత్వంలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
సమావేశం ముగిసిన అనంతరం డీకే శివకుమార్ హైదరాబాద్కు బయల్దేరారు. సాయంత్రం వరకు డీకే హైదరాబాద్కు చేరుకోనున్నారు. రాత్రి సీఎల్పీ సమావేశం నిర్వహించి, సీఎం పేరును డీకే శివకుమార్ అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఖర్గేతో భేటీకి ముందు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో డీకే శివకుమార్, మాణిక్ రావు థాక్రే వేర్వేరుగా చర్చలు జరిపారు. వీరిద్దరూ సీఎం పోస్టు కోసం పోటీ పడుతున్నట్లు వార్తలు షికారు చేసిన సంగతి తెలిసిందే. అయితే రేవంత్నే సీఎం చేయాలని రాహుల్ గాంధీ కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.