హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తున్నదని బీఆర్ఎస్ ధ్వజమెత్తింది. ఈ ఉల్లంఘనలకు సంబంధించి శనివారం సీఈవో వికాస్రాజ్కు 6 అంశాలపై ఫిర్యాదు చేసింది. కర్ణాటక ప్రజల సొమ్ముతో తెలంగాణలో ఎన్నికల ప్రకటనలు ఇస్తున్న సిద్ధరామయ్య సర్కారుపై చర్యలు చేపట్టాలని కోరింది. ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాట్లాడుతున్న భాషపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ 11 వీడియోలను సమర్పించడంతోపాటు మంత్రి కేటీఆర్పై కారుకూతలు కూసిన మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావుపైనా ఫిర్యాదు చేసింది.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 32 మంది బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయడంతోపాటు వారి కుటుంబసభ్యుల ఖాతాల్లో లక్షల రూపాయలు వేసిన కాంగ్రెస్ నేతలపై చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించిన ప్రకటనలను ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీతోపాటు ఆ ప్రకటనలను ప్రదర్శిస్తున్న యూఎఫ్వో మూవీస్ ఇండియా, క్యూబ్ సినిమాస్ సంస్థలపై చర్యలు చేపట్టాలని కోరింది. ఈ ఫిర్యాదుపై ఎన్నికల సంఘం స్పందించకపోతే కోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ స్పష్టం చేశారు.