హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను అస్త్రంగా మలుచుకొని తెలంగాణలో కోటి ఓట్లను తొలగించేందుకు కుట్ర జరుగుతున్నదని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. సోమవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగిన అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ ఉపాధ్యక్షుడు, సీపీఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభలో ఆయన మాట్లాడుతూ..
ఎన్నికల్లో బీజేపీ గెలువలేనప్పుడు నరేంద్రమోదీ ప్రభుత్వం సీబీఐ,ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఉపయోగించిందని, ఇదేవిధంగా ఇప్పుడు ‘సర్’ను ఉపయోగించి బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నదని ధ్వజమెత్తారు. అంతకుముందు సారంపల్లి మల్లారెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్రెడ్డి నివాళులర్పించడంతోపాటు ఆయన రచించిన పుస్తకం, పాటల సీడీలను ఆవిష్కరించారు. వ్యవసాయ రంగానికి సారంపల్లి మల్లారెడ్డి అందించిన సేవలను కొనియాడారు.