హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అభద్రతాభావం, అసహనం పెరిగిపోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్రెడ్డి విమర్శించారు. బూతులు మాట్లాడటం, కోతలు కోయడం తప్ప చేతలు మాత్రం లేవని సీఎంపై ధ్వజమెత్తారు. ఇద్దరు, ముగ్గురు జర్నలిస్టులను జైల్లో వేస్తే బుద్ధి వస్తుందన్న రేవంత్రెడ్డి ప్రకటనలు ఆయన అహంకారానికి నిదర్శనమని నిప్పులు చెరిగారు.
బుధవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్రెడ్డికి ట్యాక్స్ వసూలు చేయడం తప్ప వేరే విషయం తెలియదని ఎద్దేవా చేశారు. రీసెర్చ్ టీమ్లను పెట్టుకుని, ఏ తిట్లు తిట్టాలి, ఏ వీడియో ఫేక్ చేయాలనే దానిపైనే ఆలోచన చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ చెప్పేదొకటి, చేసేదొకటని విమర్శించారు. కేంద్రం మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, రిజర్వేషన్లపై అడ్డగోలు ప్రచారం చేయబోయి విఫలమయ్యారని దుయ్యబట్టారు.