Nitish Kumar | హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ‘బీహార్ డీఎన్ఏ’ వ్యాఖ్య లు జాతీయ స్థాయిలో దుమారం రేపుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ది బీహార్ డీఎన్ఏ అని, ఆయన పూర్వీకులు బీహార్ నుంచి వలస వచ్చారని, అందుకే రాష్ట్ర ప్రజలు కేసీఆర్ను తిరస్కరించి తెలంగాణ డీఎన్ఏ ఉన్న తనను ఎన్నుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించిన విషయం విదితమే. ఈ వ్యాఖ్యలు బీహార్ను కించపరిచేలా ఉన్నాయని ఆ రాష్ట్ర నేతలు భగ్గుమంటున్నారు. తెలంగాణ డీఎన్ఏ, బీహార్ డీఎన్ఏ అంటూ వేర్వేరుగా ఉండవని, అందరిదీ హిందూస్థాన్ డీఎన్ఏనే అని జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు.
ఈ వ్యాఖ్యల వల్ల ఇండియా కూటమి మరింత బలపడుతుందని ఆశిస్తున్నారా? అంటూ రేవంత్ను ప్రశ్నించారు. డీఎన్ఏకి బదులుగా తెలంగాణ ప్రజలకు మంచి చేయడంపై రేవంత్ దృష్టిపెడితే బాగుంటుందని బీహార్ మంత్రి అశోక్ చౌబే సూచించారు. నితీశ్ కుమార్ డీఎన్ఏ చెడ్డదంటూ 2015లో ప్రధాని మోదీ కూడా వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. అయితే రేవంత్ వ్యాఖ్యల గురించి తనకేమీ తెలియదని బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ అన్నారు.
రేవంత్ వ్యాఖ్యలు సిగ్గుచేటని బీజేపీ సైతం మండిపడింది. ఆయన మాటలు ప్రజలను విభజించేలా ఉన్నాయని కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ధ్వజమెత్తారు. ‘దేశాన్ని ముక్కలు చేయాలని రేవంత్ అనుకుంటున్నారా? ఆయన తీరుపై బీహార్లోని కాంగ్రెస్ నేతలు ఎందుకు స్పదించడం లేదు?’ అని ప్రశ్నించారు. రేవంత్తో క్షమాపణ చెప్పించాలని కాంగ్రెస్తోపాటు ఇండియా కూటమిలోని ఇతర పార్టీలను డిమాండ్ చేశారు. బీహార్ ఎంపీ, మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ సైతం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇండియా కూటమి మొదటి నుంచే హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నదని నిప్పులు చెరిగారు.
రేవంత్ వ్యాఖ్యలపై కేంద్ర సహాయ మంత్రి నిత్యానంద్రాయ్ స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాలను ప్రోత్సహిస్తున్నదని మండిపడ్డారు. బీహార్ను, కుర్మి ప్రజలను విమర్శించిన పార్టీతో నితీశ్ కుమార్ పొత్తు పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుర్మి సామాజిక వర్గీయుడైన నితీశ్ కుమార్ వెంటనే ఇండియా కూటమి నుంచి వైదొలగాలని లేదా రేవంత్ రెడ్డితో క్షమాపణ చెప్పించాలని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా, ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ డిమాండ్ చేశారు.