హైదరాబాద్, ఏప్రిల్ 14(నమస్తే తెలంగాణ): సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్రెడ్డి కొట్టిన దెబ్బకు సీఎం రేవంత్ దిగొచ్చారు. గతంలో ఎన్నడూ జగిత్యాల కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పట్టించుకోని ఆయన మంగళవారం ఏకంగా వారితో హైదరాబాద్లోని తన ఇంట్లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జీవన్రెడ్డితోపాటు భారీ సంఖ్యలో కీలక నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమవుతుండటంతో రేవంత్ ఆందోళనకు గురవుతున్నారనే చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ క్యాడర్ బీఆర్ఎస్లో చేరకుండా వారిని అడ్డుకొనేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసిం ది. ఎప్పుడూలేని విధంగా కాంగ్రెస్ నేతలను ఇంటికి పిలిపించుకొని మరీ మాట్లాడటంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇదంతా స్వార్థం కోసం చేస్తున్నదే తప్ప.. ప్రేమతో కాద నే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేతలతో భేటీ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తాను ఉన్నానని, అందరం కలిసి జగిత్యాలను అభివృద్ధి చేసుకుందామని సుద్దులు చెప్పారు. రేవంత్ ఇంత హడావుడిగా జగిత్యాల నేతలతో భేటీ కావడంపై జోరుగా చర్చ జరుగుతున్నది.
జీవన్రెడ్డి కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరుతుండటంతో సీఎం ఆందోళనకు గురవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జీవన్రెడ్డితోపాటు కాంగ్రెస్ కీలక నేతలు, వేలాదిమంది కార్యకర్తలు సైతం బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇదే జరిగితే జగిత్యాలలో కాంగ్రెస్ ఖతం కావడం ఖాయమనే ఆందోళనలో సీఎం ఉన్నారని, దీంతో కీలక నేతలు, కార్యకర్తలు పార్టీ వీడకుండా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. కార్యకర్తల భేటీ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి తనకు మాజీ మంత్రి జీవన్రెడ్డిపై ఎంతో ప్రేమ ఉన్నదని చెప్పుకొనేందుకు ప్రయత్నించడం గమనార్హం. జీవన్రెడ్డికి ఎప్పుడూ ఏమీ తక్కువ చేయలేదని, ఆయన మర్యాదను తగ్గించలేదని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఆయన మొండిపట్టుతో కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో సీఎం వ్యాఖ్యలపై భేటీకి వెళ్లిన నేతలు అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఒకవైపు సీనియర్ అనే గౌరవం లేకుండా జీవన్రెడ్డిని అవమానించి, ఇప్పుడు సుద్దులు చెప్పడంపై మండిపడుతున్నారు. కాంగ్రెస్ను వ్యతిరేకించిన, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన ఫిరాయింపు ఎమ్మెల్యే సంజయ్ను పక్కనపెట్టుకోవడం మంచి పని చేసినట్టా? అని ప్రశ్నిస్తున్నారు. జీవన్రెడ్డి తన ఆత్మగౌరవాన్ని చంపుకోలేక బీఆర్ఎస్లో చేరుతుంటే మళ్లీ ఆయనపై నిందలు వేసే కుట్రలు చేస్తారా? అని మండిపడుతున్నారు.