KTR | నాగర్కర్నూల్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): ‘కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించిండ్రు. నల్లగొండలో కేసీఆర్ ఆధ్వర్యంలో సభ పెడితే అసెంబ్లీలో అదేం లేదని బుకాయించినవ్. మరి ఎండాకాలం వస్తుందని, శ్రీశైలంలో తాగునీటి కోసం నీళ్లు కావాలంటూ కేఆర్ఎంబీకి ఉత్తరం రాయాలని సీఎస్కు, ఇరిగేషన్ అధికారులకు ఎందుకు లేఖ రాశావ్?’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. యువతకు రూ.4 వేల నిరుద్యోగ భృతి హామీ పైనా ప్రియాంక సభలో రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాగర్కర్నూల్, అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఆదివారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెఢ్డి అధ్యక్షతన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంనిర్వహించారు. ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ తీరు, కాంగ్రెస్, బీజేపీల దుర్నీతిని ఎండగట్టారు.
తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలంటే పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండాలని కేటీఆర్ అన్నారు. ‘ఏప్రిల్, మే నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి. దేశంలో మోదీ హవా లేదు.. మన్నూ లేదు. అంతా ఉత్తదే.. బోగస్ ముచ్చట. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామని చెప్పి మోదీ మాటతప్పిండు. కర్ణాటకలో అప్పర్ భద్రకు జాతీయ హోదా ఇచ్చిండ్రు. కృష్ణా ప్రాజెక్టులను నరేంద్రమోదీకి తాకట్టు పెట్టి, కేఆర్ఎంబీకి అప్పజెప్పి మన జుట్టును ఢిల్లీ చేతిలో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం.
శ్రీశైలంలో కరెంట్ ఉత్పత్తి చేయనీకె వీలులేదు. చుక్కనీరు తీసుకోవాలన్నా అనుమతి కావాల్సిందే. మెడమీద కత్తి పెట్టినా ప్రాజెక్టులు కేసీఆర్ ఇయ్యలేదు. పాలమూరు బిడ్డగా చెప్పుకుంటున్న రేవంత్ మాత్రం శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాల ప్రాజెక్టులను ఢిల్లీ చేతుల్లో పెట్టిండు. ఈ అంశంపై నల్లగొండలో కేసీఆర్ మీటింగ్ పెడితే వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఎండాకాలంలో తాగునీటి విడుదల కోసం కేఆర్ఎంబీకి ఉత్తరం రాయాలని చీఫ్ సెక్రటరీకి, ఇరిగేషన్ అధికారులకు సీఎం రేవంత్ చెప్పిండు. ప్రాజెక్టులను అప్పగించకుంటే, అవి ప్రభుత్వం చేతిలోనే ఉంటే నీళ్ల కోసం లేఖ ఎందుకు రాయాలి? అసెంబ్లీలో చెప్పింది నిజమా? మంచినీళ్ల కోసం కేఆర్ఎంబీకి లేఖరాయడం నిజమా? అని ప్రశ్నించారు.
కేటీఆర్ సభలో మాట్లాడుతుండగా కరెంట్ పోయింది. దీంతో కార్యకర్తలంతా ఒక్కసారిగా ఘొల్లుమని నవ్వారు. కరెంట్ వచ్చాక కేటీఆర్ మాట్లాడుతూ.. మార్పు బాగుందా? అని నవ్వుతూ ప్రసంగాన్ని కొనసాగించారు.
కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించి కాంగ్రెస్ కృష్ణాను తాకట్టుపెడితే, పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వకుండా బీజేపీ దగా చేసిందని కేటీఆర్ దుయ్యబట్టారు. ‘బాధతో చెప్తున్నా.. రేవంత్ దగుల్బాజీ ముఖ్యమంత్రి. ఎన్నికలకు ముందు ప్రియాంకగాంధీ సమక్షంలో యూత్ డిక్లరేషన్లో యువతకు నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ ఏమైంది? నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి అసెంబ్లీలో ప్రకటించారు. ఇందులో ఎవరివి ఝూటా మాటలు? నిరుద్యోగ భృతి ఇస్తారో.. ఇవ్వరో ప్రియాంకగాంధీ సభలోపు చెప్పాలి.
కాంగ్రెస్ అబద్ధాలను ప్రజలకు వివరించేందుకు ఇంటింటికీ పుస్తకాలు పంచుతాం. ఎన్నికల్లో మోసం చేసేటోళ్లనే ప్రజలు నమ్ముతరని నాడు అన్నారు. ఆ మాటలను మనం సరిగ్గా ప్రజలకు వివరించలేకపోయాం. అందుకే పచ్చి మోసగాడు ముఖ్యమంత్రి అయ్యిండు. లగ్గమే కాకుండా పిల్ల ఎలా పుడుతుంది? నోటిఫికేషన్ ఇయ్యకుండా ఉద్యోగాలు ఎలా ఇచ్చినట్టు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 30 వేల ఉద్యోగాలకు ఇప్పుడు లెటర్లు ఇచ్చి తానే ఉద్యోగాలు ఇచ్చానని రేవంత్ చెప్పుకోవడం సిగ్గుచేటు. ప్రజలను పిచ్చోళ్లు అనుకుంటున్నారా? రేవంత్ అపాయింట్మెంట్లు ఇచ్చిన 30 వేల ఉద్యోగాలు బీఆర్ఎస్ ఖాతాలోకే వెళ్తాయి. ఒక్క నోటిఫికేషన్ కూడా రేవంత్ ఇయ్యలేదు’ అని కేటీఆర్ స్పష్టంచేశారు.
లంకెబిందెల కోసం ఎవరు తిరుగుతారో ప్రజలకు తెలుసని సీఎం రేవంత్ను ఉద్దేశించి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘రేవంత్ సీఎంగా అయ్యాక సెక్రటేరియట్కు వచ్చి లంకె బిందెలు ఉంటాయనుకుంటే ఖాళీ బిందెలున్నాయని అన్నారు. లంకె బిందెల కోసం ఎవ్వరు తిరుగుతరో చెప్పాలి. రేవంత్ కుటుంబ సభ్యులు ఏంచేసేవారో ఇక్కడివాళ్లకే ఎక్కువ తెలుసు. గడ్డపారలు, తట్టపారలు నెత్తిమీద పెట్టుకొని, దుప్పట్లు కప్పుకొని రాత్రిపూట పాడుబడ్డ కోటల్లో, పాత గడీల్లో, పాత దేవాలయాల్లో దొంగలు తిరుగుతుంటరు. రేవంత్కు పాత బుద్ధులు గుర్తొస్తున్నయ్.
భవిష్యత్తులో ఎంతోమంది ముఖ్యమంత్రులు వస్తరు, పోతరు. కానీ తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ చిరకాలం ఉంటారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నరు. వడ్డాణాలు తెలంగాణలో పెట్టుకోరని, అవి రాచరిక ఆనవాళ్లని రేవంత్ అన్నారు. మరి ఆయన కుటుంబీకులు ఎందుకు వడ్డాణాలు పెట్టుకుంటారు? అందెశ్రీ గేయం వినని, తెలంగాణ గీతంలో అర్థం తెలియని ముఖ్యమంత్రి, మంత్రులు ఇప్పుడు ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు పది జిల్లాలు లేవు. ఆ పాటలో రాష్ట్ర అధికారిక ముద్రలుగా కాకతీయ కళాతోరణం, చార్మినార్ ఉన్నాయి’ అని కేటీఆర్ వివరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా నీటిలో కొట్టుకుపోయేలా చేసే కుట్ర జరుగుతున్నదని కేటీఆర్ అనుమానం వ్యక్తంచేశారు. ‘ఇప్పుడు ఊరూరా కరెంట్ పోతున్నది. అసెంబ్లీలోనూ స్పీకర్ జనరేటర్లు పెట్టించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు పిల్లర్లు నిర్మాణ లోపంతో కుంగితే నికృష్ట మాటలు మాట్లాడుతున్నారు. ప్రాజెక్టు కొట్టుకుపోవాలన్న దురుద్దేశపూరిత ఆలోచనలు కాంగ్రెస్కు ఉన్నాయి. దేశంలో కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా ఉన్నది. పార్లమెంట్ ఎన్నికల్లో 39 సీట్లు కూడా ఆ పార్టీకి వచ్చే పరిస్థితి లేదు. రేవంత్, ఉత్తమ్, కోమటిరెడ్డి ఏనాడూ తెలంగాణ కోసం మాట్లాడలేదు. తెలంగాణ ప్రయోజనాలు గులాబీ జెండానే కాపాడుతుంది. పార్లమెంట్లో గళం విప్పాలంటే, చెడుగుడు ఆడాలంటే, తెలంగాణకోసం కొట్లాడాలంటే గులాబీ దండుకే దమ్మున్నది. తెలంగాణ కోసం గల్లా పట్టి అడగాలంటే బీఆర్ఎస్ పార్లమెంట్లో ఉండాల్సిందే. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని రేవంత్ అంటున్నారు. తెలంగాణ లేకుండా చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. రాష్ట్రం ఉన్నంత కాలం తెలంగాణ నుంచి కేసీఆర్ను తొలగించలేరు’ అని తేల్చిచెప్పారు.
అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ అందరికీ అన్నీ ఫ్రీ అన్నదని, ఇప్పుడు కొత్త సన్నాయి నొక్కులు నొక్కుతున్నదని కేటీఆర్ మండిపడ్డారు. ‘కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు పెట్టిన వంద రోజుల గడువు మార్చి 9 కూడా దగ్గర పడుతున్నది. హామీల అమలు గురించి అడిగితే ప్రభుత్వంలో ఉన్నవాళ్లకు రోషం పొడుచుకొస్తున్నది. అడ్డం పొడుగు మాట్లాడుతున్నారు. 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అన్నారు. సోనియమ్మ కరెంటు బిల్లు కడుతుందన్న రేవంత్… ఇప్పుడు ఆ బిల్లులు ఎవరికి పంపాలో చెప్పాలి. ఇది అడిగితే బేబేబే…మేమేమే అంటున్నారు. ఇప్పుడు మార్పు బాగున్నదా? తెలంగాణ నుంచి బీఆర్ఎస్ను విడదీసే శక్తి ఎవరికీ లేదు. తీస్మార్ఖాన్లే ఏమీ చేయలేకపోయారు. ఈ బుడ్డర్ ఖాన్తో ఏమీకాదు. ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్, బీజేపీకి లేవు. ఆ రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు ద్రోహం చేశాయి. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజం. నాయకులు, కార్యకర్తలు కుంగిపోవద్దు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రజలపై, జర్నలిస్టులపై కేసులు పెడుతున్నారు’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అచ్చంపేట, ఫిబ్రవరి 25: అచ్చంపేటలో జరిగిన సన్నాహక సమావేశంలో నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం వెంకటేశ్వర్లబావి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, ఆదివాసి పద్మ స్పీచ్కు కేటీఆర్ ఫిదా అయ్యారు. పద్మతో ఫొటో దిగి అభినందించారు. పద్మ మాట్లాడుతూ ‘బీఆర్ఎస్ పార్టీ ఓడిపోలేదు. ఉద్యమం చేసి కోట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకొని విజయం సాధించాం. కేసీఆర్ ఎప్పుడూ ప్రజల గుండెల్లోనే ఉంటారు. మనం ఓడిపోయామని ఎప్పుడూ బాధపడాల్సిన అవసరంలేదు. తెలంగాణ తెచ్చిననాడే మనం గెలిచి నిలబడ్డాం. తెలంగాణ వచ్చిన తర్వాతే గువ్వల బాలరాజు అన్న నాకు సర్పంచ్గా అవకాశం కల్పించారు. ఐదేండ్లపాటు ప్రజల కోసం పనిచేశాను’ అని గుర్తుచేశారు.
దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం పరామర్శించారు. మాజీ మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డితో కలిసి ఉదయం కార్ఖానాలోని ఆమె నివాసానికి వెళ్లి లాస్యనందిత చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఆమె తల్లి, సోదరిని ఓదార్చారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మరణించారన్న వార్త విని షాక్కు గురయ్యానని చెప్పారు. విదేశాల్లో ఉండటం వల్ల ఆమె అంత్యక్రియలకు హాజరు కాలేపోయానని తెలిపారు. కవాడిగూడ కార్పొరేటర్గా పనిచేసిన సమయంలో లాస్యనందితను దగ్గరగా చూశానని, ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం ఎంతో ఆప్యాయంగా ఉన్న లాస్యనందిత మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరమని అన్నారు. కుటుంబం మనోధైర్యంతో నిబ్బరంతో ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు.
తుర్కయాంజల్, ఫిబ్రవరి 25: జర్నలిస్ట్ శంకర్పై హత్యాయత్నం వెనుక ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుట్ర ఉన్నదని, కొడంగల్లో రైతులకు చెందిన భూముల కబ్జాలపై నిజాలు వెల్లడించినందుకే శంకర్పై దాడి చేయించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. దాడిలో గాయపడిన శంకర్ను ఆదివారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై శంకర్ లేవనెత్తుతున్న ప్రశ్నలను తట్టుకోలేకనే ఆయనపై దాడికి తెగబడ్డారని అన్నారు. ఈ దారుణానికి సీఎం రేవంత్ పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. శంకర్ను అంతమొందించాలన్న లక్ష్యంతో పథకం ప్రకారం భౌతికదాడికి పాల్పడిన దుర్మార్గులపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేయకుండా అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ఎండగడుతూ ప్రధాన ప్రతిపక్షంగా కార్యాచరణ చేపడుతామని హెచ్చరించారు.
శంకర్పై దాడి విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని రాష్ట్ర డీజీపీని కోరారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబసభ్యుల గురించి కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు అడ్డగోలుగా మాట్లాడినా తాము ఎన్నడూ భౌతికదాడులకు పాల్పడలేదని గుర్తుచేశారు. శంకర్తోపాటు ఆయన కుటుంబసభ్యులకు అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. కేటీఆర్ వెంట మాజీ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, గువ్వల బాలరాజ్, బాజిరెడ్డి గోవర్ధన్, రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దూదిమెట్ల బాలరాజ్, పల్లె రవికుమార్, వంగేటి లక్ష్మారెడ్డి, తుర్కయాంజల్ కౌన్సిలర్ కీర్తన తదితరులు ఉన్నారు.