Telangana | నారాయణఖేడ్, నవంబర్ 22: ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నారాయణఖేడ్లో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి గిరిజనుల ఆరాధ్య గురువు సేవాలాల్ మహరాజ్ను దారుణంగా అవమానించారు. రేవంత్ ప్రసంగం ముగిసిన అనంతరం ఆ పార్టీ గిరిజన నాయకులు రేవంత్రెడ్డికి సేవాలాల్ మహరాజ్ చిత్రపటాన్ని బహూకరిస్తుండగా తోసేశారు. తమ ఆరాధ్యగురువుపై రేవంత్ తన అగ్రకుల దురహంకారం ప్రదర్శించారని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అక్టోబర్ 30న బీఆర్ఎస్ బహిరంగ సభ సందర్భంగా సీఎం కేసీఆర్ సేవాలాల్ మహరాజ్ చిత్రపటాన్ని సగౌరవంగా స్వీకరించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రేవంత్ గిరిజనులపై తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్న తీరును జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ఆరాధ్యగురువును అవమానపర్చిన రేవంత్కు బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు.