హైదరాబాద్, అక్టోబర్ 10,(నమస్తే తెలంగాణ)ః టీపీసీసీ అద్యక్షుడు రేవంత్ తన కోవర్టులను కమలం గూటికి చేర్చారా? బీజేపీ సీనియర్ నేతలే ఈ మాట అంటున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్తో కుమ్మకై కాంగ్రెస్ పార్టీ బలహీన అభ్యర్థిని బరిలో నిలిపిందన్న ఆరోపణలకు మరింత బలం చేకూర్చింది. పార్టీలో కొందరు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ‘దగ్గరి మనుషులు’ ఉన్నారని బీజేపీ సీనియర్ నాయకుడు, గత శాసనసభ ఎన్నికల్లో ఎల్బీ నగర్ నుంచి పోటీచేసిన అభ్యర్థి పేరాల శేఖర్రావు పార్టీ పెద్దలకు రాసిన లేఖలో పేర్కొనడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ‘బీజేపీలో కొందరు నేతలు తమ వ్యక్తిగత స్వార్థ రాజకీయాల కోసం లోపాయికారీ వ్యవహారాలకు పాల్పడుతున్నారు’ అని పేరాల శేఖర్రావు తన లేఖలో ఆవేదన వ్యక్తంచేసారు. దీంతో హుజూరాబాద్ బరిలో కాంగ్రెస్ పార్టీ.. బీజేపీ అభ్యర్థికి లాభం చేకూర్చేవిధంగా అభ్యర్థిని ఎంపిక చేసిందన్నది ఒట్టి ఆరోపణ కాదని వాస్తవమేనని.. ఈ లేఖతో స్పష్టమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, పార్టీ జాతీయ నాయకులు లక్ష్మణ్, డీకే అరుణ, మురళీధర్రావు, పార్టీ రాష్ట్ర ఇంచార్జి మంత్రి శ్రీనివాస్, ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత సంఘచాలక్ దక్షిణమూర్తి తదితరులకు పేరాల శేఖర్రావు రాసిన అంతర్గత లేఖ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ లేఖకు నేపథ్యం జీహెచ్ఎంసీ ఎన్నికలతో ముడిపడి ఉన్నది. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లింగోజిగూడ కార్పొరేటర్గా బీజేపీ నుంచి గెలిచిన రమేశ్గౌడ్ ప్రమాణ స్వీకారం చేయకముందే గుండెపోటుతో మరణించడంతో జరిగిన ఉప ఎన్నికల్లో రమేశ్గౌడ్ కుమారుడిని బీజేపీ తమ అభ్యర్థిగా బరిలోకి దించగా, వారి కుటుంబం పట్ల సానుభూతితో టీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టలేదు. కాంగ్రెస్ మాత్రం అభ్యర్థిని బరిలోకి దింపడంతో బిజేపీ అభ్యర్థి ఓడిపోయింది. లింగోజిగూడలో బీజేపీ అభ్యర్థి ఓటమికి పార్టీలోని కొందరు కోవర్టులే కారణమని పేరాల శేఖర్రావు తన లేఖలో బట్టబయలు చేసారు. రాష్ట్ర బిజేపీలో అధిపత్యపోరు, అంతర్గత కుమ్ములాటలు ఏవిధంగా కొనసాగుతున్నాయో తన నాలుగు పేజీల లేఖలో పేరాల శేఖర్రావు సవివరంగా పేర్కొన్నారు. పార్టీలో కొందరు తమ వ్యక్తిగత రాజకీయ, ఆర్థిక, స్వార్థం కోసంలోపాయికారి వ్యవహారాలు నడపుతున్నట్టు పేరాల శేఖర్రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తప్పు చేస్తున్న నాయకులకే కొందరు పార్టీ పెద్దలు రక్షణ కవచాలుగా నిలబడుతున్నట్టు కూడా ఆవేదన వ్యక్తంచేసారు. రాష్ట్ర బీజేపీలో ఏమి జరుగుతుందో బయటపెట్టిన పేరాల శేఖర్రావు లేఖ అటు బీజేపీలోనే కాకుండా రాజకీయ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది.