KTR | రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం నేటితో ముగియనుంది. శుక్రవారం నుంచి రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన అమలులోకి రానుంది. ఈ క్రమంలో సర్పంచ్లు తమ పదవి నుంచి వైదొలగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ (ఎక్స్ ) ద్వారా స్పందించారు. ఇది సర్పంచ్ పదవికి మాత్రమే విరమణ తప్ప ప్రజాసేవకు కాదని అన్నారు.
ఐదేళ్ల కాలం తెలంగాణ ప్రజానీకానికి ఇతోధికంగా సేవచేసిన గ్రామ సర్పంచ్లు పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా వారికి కేటీఆర్ కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ గ్రామాల్లో నర్సరీలు, పల్లె ప్రకృతివనాలు, వైకుంఠ ధామాలు నెలకొల్పడంలో, దేశానికి ఆదర్శంగా నిలిపిన కృషిలో సర్పంచ్ల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. వాళ్లు మరింతకాలం ప్రజాసేవలో ఉండాలని ఆశిస్తున్నానని అన్నారు.