రఘునాథపల్లి, మార్చి 22 : ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వర్తించి 7 నెలల క్రితం ఉద్యోగ విరమణ పొందిన తనకు బెనిఫిట్స్ అందక ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నానని ఓ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు ఆవేదన వ్యక్తంచేశాడు. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురం గ్రామానికి చెందిన ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శాగ కైలాసం జాఫర్గూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో (ఎల్ఎఫ్ఎల్) ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వర్తించి నిరుడు సెప్టెంబర్ 30న ఉద్యోగ విరమణ పొందాడు. ఉద్యోగంలో ఉన్న సయమంలోనే షుగర్, బీపీతో రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి.
ఓ రోజు బైక్ పై విధులకు వెళ్తుండగా అదుపుతప్పి కిందపడడంతో కాలు విరిగింది. దీంతో కొన్ని నెలులుగా ఇంట్లోనే డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఉద్యోగ విరమణ పొంది నెలలు గడుస్తున్నా తనకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ రాకపోవడంతో అప్పులు చేసి వైద్యం చేయించుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు ఉద్యోగులు విరమణ పొందిన వెంటనే బెనిఫిట్స్ అందించేవని, ఇప్పుడు సకాలంలో డబ్బులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందిపడాల్సి వస్తున్నదని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగ విరమణ పొందిన వారికి వెంటనే డబ్బులు అందించి ఆదుకోవాలని కోరారు.