హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): ఇన్ఫార్మర్గా పరిచయమై, తన బినామీ మారి కొరకరాని కొయ్యగా తయారైన ఓ రియల్టర్ హత్యకు కుట్రచేసిన రిటైర్డు ఇన్స్పెక్టర్ను హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సోమవారం మీడియాకు వెల్లడించారు. పోలీస్ ఇన్స్పెక్టర్గా రిటైర్డు అయిన దాసరి భూమయ్యకు విధి నిర్వహణలో నక్సల్స్ ఇన్ఫార్మర్గా ఎక్కటి విజయపాల్రెడ్డి పరిచయమయ్యాడు. కాలక్రమంలో భూమయ్యతో కలిసి రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తూ అతడికి బినామీగా మారాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మనస్పర్దలు వచ్చాయి. 2018లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భూమయ్యను ఏసీబీ అరెస్టు చేసింది. ఏసీబీకి విజయపాల్రెడ్డే సమాచారం ఇచ్చాడని భూమయ్య అనుమనించాడు. ఈ కేసుతోపాటు ఇతర ఆస్తుల విషయంలోనూ ఇద్దరి మధ్య మనస్పర్దలు మరింత పెరిగాయి. విజయపాల్రెడ్డిని చంపించాలని భూమయ్య నిర్ణయించుకున్నాడు. విజయపాల్రెడ్డిని హత్య చేసేందుకు రూ.20 లక్షలకు కరీంనగర్కు చెందిన మామిడి చంద్రయ్య, వరంగల్కు చెందిన మాజీ నక్సలైట్ గొర్రె రాయగొల్ల అలియాస్ శంకర్, మంచిర్యాలకు చెందిన గడ్డం కుమార్తో భూమయ్య ఒప్పందం చేసుకున్నాడు. రూ.5 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చాడు. విజయపాల్రెడ్డి హత్యకు ప్లాన్ చేసేందుకు సికింద్రాబాద్లోని ఓ హోటల్లో వీరంతా కలుసుకోగా, సమాచారం అందుకున్న పోలీసులు గ్యాంగ్ను అదుపులోకి తీసుకున్నారు. రిటైర్డు ఇన్స్పెక్టర్తోపాటు మామిడి చంద్రయ్య, శంకర్, కుమార్ను అరెస్టు చేశారు. వారినుంచి కంట్రీమేడ్ పిస్టల్, లక్ష నగదు, ఆరు సెల్ఫోన్లు, రెండు వేట కొడవళ్లను స్వాధీనం చేసుకున్నారు.