పెద్దపల్లి, అక్టోబర్ 23: ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ (రేవా) ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో గురువారం పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. కుటుంబంతో ఆనందంగా గడపాల్సిన సమయంలో బకాయిల కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి దాపురించిందని వారు ఆవేదన చెందారు. పెన్షనర్ల బకాయిలు ఇవ్వాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఈ సందర్భంగా ‘రేవా’ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకిశాల ప్రభాకర్రావు మాట్లాడుతూ.. ఉద్యోగ విరమణపొంది ఏడాదిన్నర దాటినా.. బెనిఫిట్స్ అందక రిటైర్డ్ ఉద్యోగుల బతుకులు ఆగమవుతున్నాయని అన్నారు. జీపీఎఫ్, జీఐఎస్, లీవ్ ఎన్క్యాష్మెంట్, కమ్యూటేషన్, గ్రాట్యూటీ అందలేదని వాపోయారు. ఉమ్మడి జిల్లా కోశాధికారి కనపర్తి దివాకర్ మాట్లాడుతూ.. బకాయిలు వచ్చేదాకా పోరాటం చేస్తామని, అవసరమైతే ఆమరణ దీక్ష చేస్తామని హెచ్చరించారు. బకాయిలు అందక ఇప్పటివరకు రాష్ట్రంలో 18 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మానసిక వేదనతో చాలామంది అనారోగ్యం బారినపడి దవాఖానల్లో ఉన్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) జల్ద అరుణశ్రీకి వినతిపత్రం అందజేశారు.