మేము వాపస్ ఇచ్చిన పైసలు మరో మూడు నిరుపేద కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చాలి. మనం మనకోసం కాకుండా ఇతరుల కోసం బతకాలి. కేసీఆర్ ఈ పథకం తేవడం చరిత్రాత్మకం. నాలాగా, నా పిల్లల్లాగా మిగతా ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఆలోచించాలి.. ఇది.. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒక దళిత ఉపాధ్యాయుడు నరసింహస్వామి కుటుంబం తీసుకొన్న అపూర్వ నిర్ణయం.
డబ్బులు వాపసు ఇస్తే నాకెంతో తృప్తి. ఈ డబ్బును ఇంకో నిరుపేద దళిత కుటుంబానికి ప్రభుత్వం ఇస్తుంది. ఇది నా ఉడతా భక్తి. నాకు ఇపుడు ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ డబ్బులు సరిపోతాయి. నేను బతకడానికి ఇంతకన్నా ఏమవసరం ఉంటది?.. అదే నియోజకవర్గంలోని మరో విశ్రాంత ఉద్యోగి మోహన్రావు కుటుంబం ఆదర్శప్రాయమైన ఆలోచన ఇది.
కడు పేదరికంలో ఉన్న దళితులకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళితబంధు మహాయజ్ఞానికి చేదోడుగా నిలిచిన దళిత కుటుంబాలివి.
నూరుశాతం దళిత కుటుంబాలన్నింటికీ సాయంచేస్తామని సీఎం ప్రకటించినప్పటికీ.. నిజంగా ఆర్థికంగా అవసరమున్నవారికి మాత్రమే ఈ పథకం అందాలన్న గొప్ప మనసుతో.. తమకు వచ్చిన ఫలాన్ని మరో నిరుపేదకు అందించాలని కోరుతూ ప్రభుత్వానికి అప్పగించిన ఆదర్శ కుటుంబాలివి.
నాడు రైతుబంధు పథకం తెచ్చినప్పుడు ఎందరో పెద్ద రైతులు.. తమకు వచ్చిన పెట్టుబడి సాయాన్ని చిన్నసన్నకారు రైతులకందివ్వాలని వాపస్ ఇచ్చారు. ఇప్పుడు దళితబంధు పథకంలోనూ.. ఆర్థికంగా ఎదిగి వచ్చిన కుటుంబాలు.. ఎంతో ఆదర్శప్రాయమైన నిర్ణయాన్ని తీసుకొని పేద దళితులకు పథకాన్ని వర్తింపజేసేందుకు గివిట్ అప్ అంటున్నాయి. ఇది కదా.. తెలంగాణ స్ఫూర్తి..
కరీంనగర్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకానికి పలువురు దళిత ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు బాసటగా నిలుస్తున్నారు. ఈ పథకం తమకు కూడా వర్తిస్తున్నా.. ‘గివిట్ అప్’ కింద ప్రభుత్వానికి వాపస్ ఇచ్చి.. తమ కంటే నిరుపేదలకు పథకం వేగంగా అందేందుకు దోహదపడుతున్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లను ఆసరా చేసుకొని తాము ఉన్నత స్థితికి చేరుకొన్నామని, చాలామంది దళితులు ఇంకా ఎంతో అట్టడుగు స్థితిలో ఉన్నారని.. అలాంటి వారి కోసం దళితబంధు అమలుచేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దళితబంధు నిజమైన పేదలకు ప్రయోజనం కలిగించేలా ఉండాలని పెద్ద మనసుతో ఆకాంక్షిస్తున్నారు. హుజూరాబాద్కు చెందిన ఒకే కుటుంబంలోని విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు, ఆయన ఇద్దరు కొడుకులు, మరో కుటుంబంలో విశ్రాంత అసిస్టెంట్ ఇంజినీరు, జమ్మికుంట మండలానికి చెందిన మరో దళిత యువకుడు దళితబంధును ‘గివిట్ అప్’ కింద ఇచ్చి ఆదర్శప్రాయంగా నిలిచారు. వీరు తీసుకొన్న నిర్ణయం పట్ల మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్తోపాటు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ హర్షం వ్యక్తంచేశారు. వీరిని అభినందించారు.
హుజూరాబాద్ పట్టణం సోషల్ వెల్ఫే ర్ కాలనీలో ఉంటున్న కర్రె నరసింహస్వామి, అనసూయ దంపతులు ఉపా ధ్యాయులుగా రిటైరయ్యారు. నలుగురు కొడుకులు మంచి స్థితిలో ఉన్నారు. పెద్ద కొడుకు నవీన్కుమార్ ములుగులో కాంట్రాక్టు లెక్చరర్. ఇతని భార్య ఉపాధ్యాయురాలే. రెండో కొడుకు ప్రవీణ్కుమార్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీరు. చిన్న కొడుకు కిరణ్కుమార్ ఐఆర్ఎస్. రైల్వేలో సీనియర్ డివిజనల్ ఇంజినీర్గా హైదరాబాద్లో పనిచేస్తున్నారు. వీరిని అధికారులు దళితబంధు సర్వేలో అర్హులుగా గుర్తించారు. అయితే నరసింహస్వామి తనతోపాటు తన కొడుకుల పేరిట వచ్చిన దళితబంధు డబ్బులను తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేశారు. ఇద్దరు కొడుకులు తమ తండ్రి తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తంచేశారు.
హుజూరాబాద్ పట్టణ నివాసి సోటాల మోహన్రావు విశ్రాంత అసిస్టెంట్ ఇంజినీర్. ఆయన దళితబంధు పథకానికి అర్హుడే. పేదలకు లబ్ధి జరిగేలా చూడాలంటూ తనకు వచ్చిన రూ.10 లక్షలను ‘గివిట్ అప్’ చేశారు. ప్రభుత్వం తనకు నెల నెలా ఇస్తున్న పెన్షన్ సరిపోతుందని చెప్తున్నారు. జమ్మికుంట మండలం కోరపల్లికి చెందిన ఎడ్ల రవీందర్ ప్రభుత్వ ఉద్యోగి కాదు. ఇతని తండ్రి విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి. తన తండ్రి కూడా దళితబంధుకు అర్హుడైనందున అతని పేరిట ఇచ్చే రూ.10 లక్షలతో ఏదైనా చేసుకుంటామని, తన పేరిట వచ్చిన రూ.10 లక్షలను ‘గివిటప్’ కింద ఇచ్చేసి ఆదర్శంగా నిలిచారు.
దళిత కుటుంబంలో పుట్టిన నేను ఒకప్పుడు అష్టకష్టాలు పడ్డాను. అంబేద్కర్ స్ఫూర్తి, రిజర్వేషన్ల పుణ్యాన చదువుకున్నా. నేను, నా భార్య ఉపాధ్యాయులుగా పనిచేశాం. మా ముగ్గురు కొడుకులకు మంచి ఉద్యోగాలున్నాయి. మాకు పెన్షన్ వస్తున్నది. నాతోపాటు మా ఇద్దరు కొడుకులకు దళితబంధు వచ్చింది. మా కంటే దయనీయ స్థితిలో ఉన్న దళితులకు ఈ పథకం వర్తించాలి. మేము వాపస్ ఇచ్చిన పైసలు మరో మూడు నిరుపేద కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చుతాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నా. మనం మన కోసం కాకుండా ఇతరుల కోసం కూడా బతకాలనేది నా ఆలోచన. సీఎం కేసీఆర్ ఈ పథకం తేవడం చరిత్రాత్మకం. నాలాగా, నా పిల్లల్లాగా మిగతా ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు కూడా ఆలోచించాలి.
కర్రె నరసింహస్వామి, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు, హుజూరాబాద్
నేను అంబేద్కర్ దయవల్ల మంచిగ చదువుకొని, మంచి ఉద్యోగం చేసిన. మా కుటుంబం మంచి స్థితిలో ఉన్నది. నా కంటే చాలామంది నా జాతి ప్రజలు దయనీయ స్థితిలో ఉన్నరు. అలాంటి వారిని ఉన్నత స్థితికి తేవాలని యోచిస్తున్న ప్రభుత్వానికి నాకు వచ్చే డబ్బు వాపసు ఇస్తే నాకెంతో తృప్తి. ఈ డబ్బును ఇంకో నిరుపేద దళిత కుటుంబానికి ప్రభుత్వం ఇస్తుంది. ఇది నా ఉడతా భక్తి. నాకు పెన్షన్ డబ్బులు సరిపోతాయి. నేను బతకడానికి ఇంతకన్నా ఏమవసరం ఉంటది? దళితబంధు తెచ్చిన కేసీఆర్కు ధన్యవాదాలు. .
సోటాల మోహన్రావు, విశ్రాంత పీఆర్ ఏఈ, హుజూరాబాద్