హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్(ఐటీఐఆర్) ప్రాజెక్టును పునరుద్ధరించాలని కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వనీవైష్ణవ్కు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ శుక్రవారం కేంద్రమంత్రిని కలిసి, పలు అంశాలపై వినతిపత్రం అందజేశారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు ఐటీ రంగ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని, లక్షల మంది యువతకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. దీనిని పునరుద్ధరించాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ ఎన్నోమార్లు లేఖలు రాసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈఎంసీ-2.0 స్కీమ్ కింద దివిటిపల్లిలో ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్ విస్తరణకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీరంగాన్ని ప్రోత్సహించేందుకు దుండిగల్ వద్ద 450 ఎకరాల స్థలాన్ని గుర్తించినట్టు కేంద్ర మంత్రికి వివరించారు. గ్రామ పంచాయతీలను టీ-ఫైబర్తో అనుసంధానించేందుకు ఉద్దేశించిన భారత్నెట్ ఫేజ్-2 ప్రాజెక్టు అవగాహన ఒప్పందం ప్రకారం చెల్లింపులు చేయాలని కోరారు. గ్రామ పంచాయతీలతో చిన్న గ్రామాలను అనుసంధానించేందుకు రూ.1,200 కోట్ల అదనపు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్(ఎన్వోఎఫ్ఎన్) ఫేజ్-1 నెట్వర్క్ను టీ-ఫైబర్కు అప్పగించాలని కోరారు.