హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ఈ విద్యాసంవత్సరంలో కచ్చితంగా అడ్మిషన్లు 50 శాతం దాటాల్సిందేనని లేకుంటే పాలనాపరమైన చర్యలు తప్పవని మైనారిటీ గురుకుల స్కూళ్లు/కాలేజీల ప్రిన్సిపాళ్లకు టీజీఎంఆర్ఈఐఎస్ కార్యదర్శి హెచ్చరికలు జారీచేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నెల 22న నిర్వహించిన ప్రిన్సిపాళ్లు, సెక్షన్ ఇన్చార్జ్ల సమావేశంలో ఈ మేరకు స్పష్టం చేసినట్టు సమాచారం. మందకొడిగా ప్రవేశాలు సాగుతున్న 24 స్కూళ్లకు చెందిన ప్రిన్సిపాళ్లకు ప్రత్యేకంగా సూచనలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కేసీఆర్ పాలనలో 204 మైనారిటీ గురుకులాలను ఏర్పాటుచేశారు. వాటిలో ప్రతి ఏటా ప్రవేశాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. స్కూళ్లు/కాలేజీల్లో 2021-22లో 1,14,440 మంది ప్రవేశాలు తీసుకున్నారు. 2022- 23లో 1,25,218 మంది చేరారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024-25 కేవలం 20 శాతం సీట్లే భర్తీ అయ్యాయి. ఆ తర్వాత డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించడం, స్కూళ్లు/కాలేజీల సిబ్బందికి టార్గెట్ విధించడంతో 1,05,000 మంది విద్యార్థులు వచ్చి చేరారు. అయినప్పటికీ దాదాపు 20 వేల మంది తగ్గిపోయారు. ఇక 2025-26లో ఇప్పటివరకు చాలా గురుకులాల్లో 50 శాతం కంటే తక్కువగా చేరినట్టు సమాచారం.
ఈ నెల 22న మైనారిటీ గురుకుల సెక్రటరీ షఫీయుల్లా ప్రిన్సిపాళ్లు, ఇన్చార్జ్లతో సమావేశం నిర్వహించారు. విద్యార్థుల ప్రవేశాలు, గురుకులాల్లో వసతులు, బోధనా సిబ్బంది పనితీరు ఇతరత్రా అంశాలపై చర్చించారు. విద్యాసంవత్సరం ప్రారంభమై పది రోజులు దాటినా అడ్మిషన్ల ప్రక్రియ ఎందుకు ఊపందుకోలేదని నిలదీసినట్టు సమాచారం. ఈ క్రమంలో 50 శాతం ప్రవేశాలు లేని 24 స్కూళ్లు/కాలేజీల ప్రిన్సిపాళ్లకు హెచ్చరికలు జారీచేశారు. వచ్చే సమీక్ష సమావేశంలోగా అడ్మిషన్ల సంఖ్యను పెంచాలని, ఇందుకు సంబంధించిన నివేదికలతో హాజరు కావాలని సూచించారు. లేదంటే బాధ్యులపై పాలనాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కాంగ్రెస్ పాలనలో మైనారిటీ గురుకులాల్లో మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం, బోధనా సిబ్బంది నియామకంలో అలసత్వం. బోధకులు ఇతర భాషల వారు కావడంతో విద్య గాడితప్పుతున్నదని విద్యావేత్తలు ఆరోపిస్తున్నారు. కానీ సంబంధిత శాఖకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రం ఆదరణ పెరుగుతున్నదని ఊదరగొడుతున్నారని మండిపడుతున్నారు. అడ్మిషన్ల కోసం మంత్రి, సెక్రటరీ స్థాయిలో సిఫార్సుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు పేషీ వద్ద క్యూ కడుతున్నారని మీడియాకు లీకులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత మొదటి ఏడాదిలోనే ఏకంగా 20 వేల అడ్మిషన్లు తగ్గడం, తాజాగా ప్రిన్సిపాళ్లు, ఇన్చార్జులకు హెచ్చరికలు జారీచేయడాన్ని ఉదహరిస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి సైతం మైనారిటీ రెసిడెన్షీయల్ స్కూళ్లను గాలికొదిలేయడంతోనే ఈ దుస్థితి దాపురించిందని పెదవి విరుస్తున్నారు.
వసతుల కల్పనలో నిర్లక్ష్యం, బోధకుల నియామకం, కాస్మొటిక్ కిట్లు ఇవ్వకపోవడం, చార్జీలు చెల్లించకపోవడం, అరకొర సౌకర్యాలు కలిగిన అద్దె భవనాల్లో కొనసాగించడం, ఇతరత్రా విషయాలపై ప్రభుత్వం దృష్టిసారించడంలేదని, ఫలితంగా అడ్మిషన్లు పడిపోతున్నాయని మైనారిటీ విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లు/రీజినల్ కో ఆర్డినేటర్లు ఆరోపిస్తున్నారు. ఇందుకు తమను బాధ్యులను చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసినా పిల్లలు చేరేందుకు ఆసక్తి చూపడంలేదని పెదవివిరుస్తున్నారు. ఇప్పటికైనా లోపాలను గుర్తించి సరిదిద్దాలని కోరుతున్నారు. అకారణంగా తమపై నెపం నెట్టి వేటు వేస్తే ఊరుకోనేదిలేదని హెచ్చరిస్తున్నారు.