జలాశయాల వద్ద సినిమా షూటింగ్లు జరగాలె
దేశవ్యాప్తంగా పర్యాటకులు రావాలె
టూరిస్ట్ హబ్ కోసం రూ.1500 కోట్లు
మల్లన్నసాగర్ ప్రారంభోత్సవంలో కేసీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 23 : రాష్ట్రంలో రిజర్వాయర్లు టూరిస్టు డెస్టినేషన్గా మారాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. ఇందుకోసం 1500 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. బుధవారం మల్లన్నసాగర్ ప్రారంభం అనంతరం బహిరంగసభలో సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
దేశానికి సిద్దిపేట ఆదర్శంగా ఉండాలే..
ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. సిద్దిపేట బిడ్డగా ఈ జిల్లా దేశానికే ఆదర్శంగా ఉండాలని కోరుకొంటున్న. మల్లన్న ఆశీస్సులతో మహత్తరమైన అవకాశం వచ్చింది. 500 మీటర్లు లేపి గోదావరిని మల్లన్నసాగర్కు తీసుకొచ్చిన. నా పని పూర్తిచేశా. ఇక మిగతాది ఇక్కడి ప్రజాప్రతినిధులదే. పక్కనే యాదాద్రి దేవాలయం. ఆ పక్కన కొమురవెల్లి మల్లన్న ఆలయం, చుట్టూ ఆకుపచ్చదనంతో అలరారే ప్రాంతమిది. కనువిందుచేసే సౌందర్యాలున్నాయి. ఆలిండియా మ్యారేజెస్ డెస్టినేషన్గా, సినిమా షూటింగ్లకోసం దేశ నలుమూలల నుంచి టూరిస్ట్లు వచ్చే అవకాశమున్నది. ఒక అద్భుతమైన ఆకర్షణగా ఉంటుంది. ఈ ప్యాకేజీ ద్వారా ఈ ప్రాంత విశిష్టతను కొనియాడే విధంగా చేయాలి. టూరిజం ప్యాకేజీ ద్వారా ప్రకృతి సౌందర్యాన్ని మరింత ఇనుమడింపజేయాలె. బంగ్లాలను కట్టుడు కాకుండా అద్భుతాలను ఆవిష్కరించాలె. మల్లన్నసాగర్లో ఏర్పాటుచేసే కలర్ ఫౌంటెన్లు దుబాయ్ బుర్జ్ ఖలీఫా వద్ద ఏర్పాటుచేసిన కలర్ ఫౌంటెన్లను మించి ఉండాలి. అవసరమైతే మంత్రులు హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్ స్వయంగా రెండుమూడు దేశాలను తిరిగిరాండ్రి. ఇక్కడ ఏర్పాటుచేసే కలర్ ఫౌంటెన్లను చూసేందుకు సింగపూర్ నుంచి టూరిస్ట్లు రావాలె. ఆలిండియా మ్యారేజెస్ డెస్టినేషన్గా రూపుదిద్దాలి. రీజినల్ రింగ్ సమీపంలో ఉన్నందుకు రిజర్వాయర్ వద్దకు రెండు లైన్ల రోడ్డును వేయాలి. మంత్రి హరీశ్రావు శక్తికి, సామర్థ్యానికి, నైపుణ్యాలకు ఏడాదిన్నర లోపల టూరిస్ట్ ప్యాకేజీ పూర్తిచేయాలి. దానిని ప్రారంభించేందుకు నేనే వస్తా.
అన్నపూర్ణ ప్రకృతి సౌందర్యానికి నెలవు
అన్నపూర్ణ రిజర్వాయర్ బ్రహ్మాండమైన ప్రకృతి సౌందర్యానికి నెలవు. ఏడుపాయల దగ్గర అద్భుతమైన జలపాతం ఉన్నది. సింగూరును మల్లన్నసాగర్ జలాలతో నింపితే అక్కడకూడా టూరిజం అభివృద్ధి చెందుతుంది. రంగనాయకసాగర్ ప్రత్యేకత.. చుట్టు నీళ్ళు ఉండి మధ్యలో ఐలాండ్ ఉంటుంది. ఏడుపాయల దగ్గర వనదుర్గ దేవత ఆశీస్సులతో అద్భుతమైన జలపాతంతోపాటు ప్రకృతి సౌందర్యమున్నది. మల్లన్నసాగర్ దగ్గర 7,500 ఎకరాల అటవీ ప్రాంతం ఉన్నది. అక్కడ ఔషధమొక్కలను నాటుతున్నారు. వాటితోపాటు కొండపోచమ్మ, బస్వాపూర్ ఇవన్నీ హైదరాబాద్కు దగ్గరగా ఉన్నాయి. వాటన్నింటినీ కలిపి అద్భుతమైన టూరిజం ప్యాకేజీని ఏర్పాటుచేయాలి. అందుకు రూ.1500 కోట్లను మంజూరు చేస్తున్న. మంత్రులు హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్ వెంటనే ఆ పనులు ప్రారంభించాలి. సినిమాలు షూటింగ్ చేసుకొనే స్థాయికి రిజర్వాయర్లను తీర్చిదిద్దాలి.