మంత్రి తలసాని శ్రీనివాస్ వెల్లడి
హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని రిజర్వాయర్లను ఆక్వాహబ్లుగా తీర్చిదిద్దాలని.. మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపల పెంపకం, చేప పిల్లల ఉత్పత్తి, చేపల ప్రాసెసింగ్, విక్రయ కేంద్రాల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మాసబ్ట్యాంక్ మత్స్యభవన్లో పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, గొర్రెల పంపిణీపై షీప్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాల్రాజ్ యాదవ్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధర్సిన్హాతో కలిసి సమీక్ష చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్స్యశాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాల నిర్వహణ కోసం అనువుగా ఉండే 159 ఎకరాలను గుర్తించామని, అందులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ఈ ఏడాది రాష్ట్రంలోని 26,778 నీటి వనరుల్లో 88.52 కోట్ల చేప పిల్లలను, 10 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. వీటి టెండర్ ప్రక్రియను నెలాఖరులోగా పూర్తిచేయాలని ఆదేశించారు. రెండో విడత గొర్రెల పంపిణీకి రూ.4,563 కోట్ల రుణాన్ని ఎన్సీడీసీ మంజూరుచేసిందని, త్వరలో పంపిణీ ప్రారంభిస్తామని తలసాని తెలిపారు. సమావేశంలో పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ ఎస్రాంచందర్, మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరాం భూ క్యా, టీఎస్ఎల్డీఏ సీఈవో మంజువాణి, వెటర్నరీ వర్సిటీ రిజిస్ట్రార్ వీరోజి పాల్గొన్నారు.