హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నలువైపులా నిర్మించనున్న టిమ్స్ దవాఖానలు పేదలకు ఉచితంగా సూపర్స్పెషాలిటీ వైద్యాన్ని అందించడంతోపాటు పరిశోధన కేంద్రాలుగా కూడా పనిచేయనున్నాయి. ఇటీవలే వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఓ సందర్భంలో ‘ప్రభుత్వ టీచింగ్ హాస్పిటళ్లలో అవకాశం ఉన్నచోట పరిశోధనలు చేసేలా ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది’ అని చెప్పారు. నూతనంగా ఏర్పాటుచేయనున్న టిమ్స్లో ప్రభుత్వం ప్రత్యేకంగా పీజీ కోర్సులు మాత్రమే ఏర్పాటు చేస్తున్నది. ప్రతి దవాఖానలో 16 స్పెషాలిటీ, 15 సూపర్ స్పెషాలిటీ పీజీ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. అల్వాల్ టిమ్స్లో న్యూరోసైన్స్, ఎల్బీనగర్ టిమ్స్లో గ్యాస్ట్రో సైన్స్, సనత్నగర్ టిమ్స్లో కార్డియాక్ సైన్స్ సూపర్ స్పెషాలిటీ సీట్లు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించిందని వైద్యశాఖ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఆయా విభాగాల్లో పరిశోధనలు జరుగుతాయని చెప్తున్నారు. తద్వారా పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించడంతోపాటు తెలంగాణ కేంద్రంగా ఆవిష్కరణలు వస్తాయన్నారు.