హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): వెనకబడిన తరగతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలు యావత్ దేశానికే దిక్సూచీగా నిలుస్తాయని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు పేర్కొన్నారు. బీసీల జీవన ప్రమాణాలతోపాటు, రాజకీయ, ఆర్థిక, విద్య, ఉద్యోగ స్థితిగతులపై శాస్త్రీయ అధ్యయనానికి శ్రీకారం చుట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. కులవృత్తుల్లో సృజనాత్మక పెంపు, ఆధునికీకరణ, ప్రత్యామ్నాయ ఉపాధి తదితర అంశాలపై బీసీ కమిషన్ అన్వేషణ మొదలుపెట్టిందని తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్ల స్థిరీకరణ కోసం అధ్యయనం చేస్తున్నట్టు వెల్లడించారు. సంక్షేమ పథకాల అమలులో సీఎం కేసీఆర్ విజన్ అపూర్వమని కొనియాడారు. కమిషన్ చైర్మన్గా ఏడాది పదవీకాలం పూర్తయిన నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
రాష్ర్టాల పర్యటన విశేషాలేమిటి?
కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో పర్యటించాం. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఆయా రాష్ర్టాలు ఇటీవల స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను స్థిరీకరించాయి. ఇందుకు అనుసరించిన విధానాలపై ఆయా రాష్ర్టాల కమిషన్లతో చర్చించాం. మరో రెండు రాష్ర్టాల్లో పర్యటించాల్సి ఉన్నది. ఆ తరువాత అన్ని అంశాలను క్రోడీకరించి, మన రాష్ర్టానికి అవసరమైన నమూనాను సిద్ధం చేస్తాం.
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల స్థిరీకరణపై సుప్రీం మార్గదర్శకాలు ఎలా ఉన్నాయి?
సుప్రీంకోర్టు మార్గదర్శకాల్లో మొదటిది ప్రతి స్థానిక సంస్థలో ఓబీసీ రిజర్వేషన్ల అమలు, ఫలితాలపై అధ్యయనం చేసేందుకు పూర్తిస్థాయి కమిషన్ను ఏర్పాటుచేయాలి. రెండోది జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్లను స్థిరీకరించాలి. మూడోది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు కలిపి 50 శాతం మించకూడదు. వాటినే ట్రిపుల్ టీ అంటారు. ఈ మార్గదర్శకాలు పాటించని ఏ రాష్ట్రంలో కూడా లోకల్బాడీ ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయకూడదని సుప్రీంకోర్టు ఇటీవల తేల్చిచెప్పింది. పలు రాష్ర్టాల్లో స్థానికసంస్థల ఎన్నికలను రద్దు చేసింది. వాటన్నింటినీ జనరల్ స్థానాలుగానే మార్చే అవకాశం ఉన్నది. సూటిగా చెప్పాలంటే కమిషన్ల నివేదిక లేకుండా స్థానికసంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లు ఇకపై ఉండబోవు. ప్రస్తుతం ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో చెలరేగుతున్న వివాదమే అందుకు నిదర్శనం. ఓబీసీ రిజర్వేషన్ల అమలు అక్కడ ప్రశ్నార్థకంగా మారింది.
కమిషన్ అధ్యయనానికి ప్రభుత్వం, ఇతర శాఖల సహకారం ఎలా ఉన్నది?
రాష్ట్ర ప్రభుత్వం, ఇతర శాఖల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తున్నది. పరిశోధన విభాగం ఏర్పాటు, నిధులు తదితర అంశాల్లో ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తున్నది. అందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు. ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన ఉపేంద్ర, శుభప్రదపటేల్, కిషోర్గౌడ్ సభ్యులు కావడం వల్ల కమిషన్ అంకిత భావంతో బాధ్యతలను నిర్వర్తిస్తున్నది.
రాష్ట్రంలో బీసీ సంక్షేమానికి తీసుకొంటున్న చర్యలపై మీ అభిప్రాయం..?
తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్లో పర్యటించి ఓబీసీ కమిషన్లు, మంత్రులు, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో అనేక అంశాలపై చర్చించాం. 15 ఏండ్లుగా బీసీ హక్కుల కోసం పనిచేస్తున్నా. కేసీఆర్ ప్రభుత్వ విధానాలను ఏ రాష్ట్రంలోనూ చూడలేదు. కల్యాణలక్ష్మి, బీసీ ఓవర్సీస్ లాంటి పథకాలు ఏ రాష్ట్రంలోనూ లేవు. బీసీలకే కాదు మొత్తంగా సంక్షేమ పథకాల అమలులో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నది.
బీసీ కమిషన్ చైర్మన్గా ఏడాది పూర్తి చేసుకొన్నారు కదా..మీరు సాధించినదేమిటి?
దేశంలోని అన్ని రాష్ర్టాలు స్థానిక సంస్థల్లో వెనకబడిన తరగతుల రాజకీయ రిజర్వేషన్ల స్థిరీకరణ అంశానికే పరిమితమయ్యాయి. కానీ, తెలంగాణ ప్రభుత్వం వాటితోపాటు బీసీల సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్య, ఉద్యోగ అంశాలపై అధ్యయనం చేయాలని సంకల్పించింది. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుగుణంగా అన్ని రాష్ర్టాల ఓబీసీ కమిషన్ల పనితీరును అధ్యయనం చేశాం. స్థానిక సంస్థల రిజర్వేషన్ల స్థిరీకరణ అంశంపై హేతుబద్ధమైన, న్యాయ సమస్యలు ఉత్పన్నం కాకుండా, ప్రామాణికమైన నివేదికను రూపొందించేందుకు కావాల్సిన ప్రాథమిక కార్యాచరణను సిద్ధం చేసుకొన్నాం. సందేహాల నివృత్తికి రాష్ర్టాల పర్యటన చేపట్టాం.
బీసీల సామాజిక, ఆర్థిక స్థితిగతుల అధ్యయనం ఎంతవరకు వచ్చింది?
ఇప్పటికే సామాజిక, ఆర్థికరంగ నిపుణులతోపాటు సెస్, సీడీఎస్ తదితర సంస్థలతో చర్చలు ప్రారంభించాం. గణాంకాలను సేకరిస్తున్నాం. క్షేత్రస్థాయిలో పర్యటించి, శాస్త్రీయమైన అధ్యయనాలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఏ చిన్న తప్పు దొర్లినా భవిష్యత్తు తరాలు క్షమించవు. చాలా లోతుగా పరిశోధించాలి.